Hyderabad: నక్కి ఉంటూ.. నేరాలు
ABN , Publish Date - Mar 01 , 2025 | 08:43 AM
వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న నైజీరియన్లను(Nigerians) తిరిగి వారి దేశాలకు పంపించాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు.
- నగరంలో జోరుగా నైజీరియన్ల డ్రగ్స్ దందా
- అక్రమంగా గ్రేటర్లో 750 మందికి పైగా
- కాలం చెల్లిన వీసాలు, తప్పుడు సమాచారంతో తిష్ఠ
వీసాల గడువు ముగిసినా నగరంలోనే కొంతమంది నైజీరియన్లు అక్రమంగా తిష్ఠ వేసి నేరాలకు పాల్పడుతున్నారు. ముంబై, బెంగళూరు, గోవా, కోల్కతా(Mumbai, Bangalore, Goa, Kolkata) వంటి నగరాల్లో ఉన్న నైజీరియన్ల నుంచి డ్రగ్స్ను తీసుకొచ్చి గ్రేటర్లో విక్రయిస్తూ పట్టుబడుతున్న సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్న డ్రగ్స్ దందాలో నైజీరియన్ల పాత్ర కీలకంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్ సిటీ: వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న నైజీరియన్లను(Nigerians) తిరిగి వారి దేశాలకు పంపించాలని పోలీసులు చేస్తున్న ప్రయత్నాల్లో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. దీంతో డ్రగ్స్ విక్రయాల్లో వారు కీలకంగా మారుతున్నారు. విద్యార్థి వీసా ముసుగులో ఇక్కడకు వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: పిటిషన్.. మెట్రో పరేషాన్..
నగరంలో దాదాపు 2,500 మంది నైజీరియన్లు ఉండగా, సుమారు 750 మందికి వీసా గడువు ముగిసినట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల కాలంలో కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ పిల్స్, గంజాయి(Cocaine, heroin, MDMA pills, marijuana) తదితర మత్తు పదార్థాలను తరలిస్తూ నైజీరియన్లు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నారు. హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ విక్రయించే నెట్వర్క్ను పెంచుకుంటూ అప్పుడప్పుడు మాత్రమే పోలీసులకు చిక్కుతున్నారు. తాజాగా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నైజీరియన్ల మధ్య జరిగిన గొడవ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
టోలిచౌకి, సన్సిటీలో అధికం
వివిధ అవసరాల నిమిత్తం నగరానికి వస్తున్న నైజీరియన్లు గడువు ముగిసినా తమకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఎక్కువ మంది టోలిచౌకి, సన్సిటీ చోట్ల ఎక్కువగా ఉంటున్నట్లు పోలీసుల తనిఖీల్లో తేలింది. నైజీరియా, సూడాన్, సొమాలియా, ఇథియోఫియాకు చెందిన సుమారు వందలాది మంది అక్రమంగా నగరంలోనే నివసిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. వారి సమాచారం కోసం స్పెషల్ బ్రాంచ్, శాంతిభద్రతలు, టాస్క్ఫోర్స్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసి్ఫనగర్, నాంపల్లి, గోల్కొండ, హుమాయిన్నగర్, లంగర్హౌస్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి కొంత మందిని గుర్తించారు. వీసాల కాలం చెల్లినప్పటికీ ఐక్యరాజ్య సమితి హై కమిషన్ నుంచి రెఫిజి సర్టిఫికెట్లు పొందుతున్నారు. ఈ సర్టిఫికెట్ల ద్వారా మరో రెండేళ్ల పాటు నగరంలో ఉండే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. కానీ చేసుకోకుండానే అక్రమంగా ఉంటున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ఇల్లు అద్దెకు ఇవ్వొద్దు
నగరంలో ఉండేందుకు వస్తున్న నైజీరియన్లకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి అనుమానం ఉన్నా పోలీసులకు లేదా ఎక్సైజ్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు. డ్రగ్స్ కేసులు నమోదైన సమయంలో తప్పుడు వివరాలు ఇస్తూ పోలీసులను బురిడీ కొట్టిస్తున్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. మే 2022లో ధూల్పేటలో 48 గ్రాముల కొకైన్ అమ్ముతూ పట్టుబడ్డ నైజీరియన్ తన పేరు, వివరాలు తప్పుగా చెప్పాడు. ఫేక్ వీసా, ఫేక్ ఆధార్ కలిగి ఉండి డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి కేసులు చాలానే ఉన్నా, మూలాల్లోకి వెళ్లి నైజీరియన్లను తిరిగి వారి దేశానికి పంపించే ప్రయత్నాలు గట్టిగా జరగడం లేదు.
ఈవార్తను కూడా చదవండి: దక్షిణాది రాష్ట్రాల తిరుగుబాటు తప్పదు
ఈవార్తను కూడా చదవండి: ఆధార్ లేకున్నా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం
ఈవార్తను కూడా చదవండి: స్వయం ఉపాధి పథకాలకు రుణాలివ్వండి
ఈవార్తను కూడా చదవండి: ‘కింగ్ ఫిషర్’ తయారీని పరిశీలించిన మహిళా శిక్షణ కానిస్టేబుళ్లు
Read Latest Telangana News and National News