B'luru Man Shoots Wife Dead: భార్యపై కాల్పులు జరిపి హత్య.. డైవర్స్ నోటీసులు అందడంతో..
ABN , Publish Date - Dec 24 , 2025 | 10:35 AM
బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. భార్య విడాకుల నోటీసు పంపిన వారం రోజులకు ఆమెను భర్త తుపాకీతో కాల్చి పొట్టనపెట్టుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: బెంగళూరులో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ టెకీ తన భార్యను తుపాకీతో కాల్చి హత్య చేశాడు. భార్య నుంచి విడాకుల నోటీసు అందిన వారం రోజుల తరువాత ఈ దారుణానికి పాల్పడ్డాడు (Bangalore Techie Shoots Wife Dead).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, నిందితుడు బాలమురుగన్ వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజినీర్. గత నాలుగు సంవత్సరాలుగా ఉద్యోగం లేక ఖాళీగానే ఉంటున్నారు. ఆయన భార్య భువనేశ్వరి (39) యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్. వారికి 2011లో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, మనస్పర్థల కారణంగా భార్యాభర్తలు ఇద్దరూ గత ఏడాదిగా వేర్వేరుగా ఉంటున్నారు. భువనేశ్వరి తన పిల్లలతో కలిసి రాజాజీనగర్లో ఉంటున్నారు. అయితే, భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టు బాలమురుగన్ అనుమానించేవాడని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో వారం క్రితం భువనేశ్వరి బాలమురుగన్కు డైవర్స్ నోటీసు పంపించారు. కోర్టులో ఈ కేసు పెండింగ్లో ఉంది. ఈ క్రమంలో మంగళవారం బాలమురుగన్ భార్యపై నిఘా పెట్టాడు. ఆమె ఆఫీసు నుంచి తిరిగొచ్చాక సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆమెపై నాలుగు రౌండ్ల కాల్పులు జరపడంతో ఆమె కుప్పకూలిపోయారు. భువనేశ్వరిని స్థానిక ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యంలోనే ఆమె కన్నుమూశారు. ఘటనపై పోలీసులు విచారణను ప్రారంభించారు. నిందితుడు తుపాకీ ఎలా సంపాదించాడనేది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవీ చదవండి..
సెల్ఫోన్ మాట్లాడుతూ..10 తులాల బంగారం బ్యాగు మరచిన మహిళ
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు