Ananthapur News: కత్తి పట్టాడు.. బుల్లెట్కు దొరికాడు..
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:06 AM
ఓ యువకుడు చేసిన వీరంగంతో అటు పోలీసులు, ఇటు స్థానికులు బెంబేలెత్తిపోయారు. అడ్డుకోబోయిన పోలీసులపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారమంతా అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే...
- మద్యం తేలేదని స్నేహితుడికి కత్తిపోటు
- పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు చుక్కలు
- పోలీసులతో వెళ్లిన ఆటో డ్రైవర్కు కత్తిపోటు
- టూ టౌన్ సీఐ శ్రీకాంత్ యాదవ్పైనా దాడి
- కాల్పులు జరిపి నిందితుడిని పట్టుకున్న సీఐ
- పేరు అజయ్ దేవరకొండ.. మద్యానికి బానిస
అనంతపురం: క్రైం సినిమాలు చూశాడో, వెబ్ సిరీస్ లు చూశాడోగానీ.. జులాయిగా మారిపోయాడు. మరికొందరు జులాయిలను జత చేసుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఒంటిపై పుర్రె, కత్తులు వంటి పిచ్చి పిచ్చి ట్యాటూలు వేయించుకున్నాడు. వయసు నిండా 19 దాట లేదు. ఇప్పటి వరకూ ఎలాంటి నేరాలు చేశాడో తెలియదు..! కానీ ఒక సీఐ సహా ముగ్గురిని కత్తితో పొడిచేశాడు. కత్తి చేతబట్టుకుని.. పట్టుకునేందుకు వచ్చినవారిని పొడుస్తూ, బెదిరిస్తూ, పరిగెడుతూ హల్చల్ చేశాడు. చివరకు పిస్టల్ తీసి గాల్లోకి కాల్పులు జరిపినా తగ్గలేదు. కాల్లోకి బుల్లెట్ దిగితేగానీ దొరకలేదు. అనంతపురం(Ananthapur) నగర శివారులోని షికారీ కాలనీ నుంచి ఆకుతోటపల్లి సమీపంలోని చెరుకు తోటల వరకూ హల్చల్ చేసిన జులాయి.. దేవరకొండ అజయ్ని పోలీసులు అతి కష్టమ్మీద పట్టుకున్నారు.
తాగుడు కోసం గొడవ
ఇటుకలపల్లికి చెందిన దేవరకొండ అజయ్కి చాకలి రాజా, సొహైల్, అక్రమ్ స్నేహితులు. నలుగురూ కలిసి అరవింద నగర్లో ఆదివారం రాత్రి మద్యం తాగారు. మరింత మద్యం తీసుకురావాలని రాజాకు అజయ్ సూచించాడు. అతను వినకపోవడంతో తన వద్ద ఉన్న కత్తితో కడుపులో పొడిచాడు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు, గాయపడిన రాజాను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అజయ్(ఏ1), సొహైల్(ఏ2), సోహెల్, అక్రమ్(ఏ3)పై కేసు నమోదు చేశారు. ప్రధాన నిందితుడు అజయ్ని అరెస్టు చేసేందుకు సీఐ శ్రీకాంత్, ఎస్ఐ రిషేంద్రబాబు, కానిస్టేబుళ్లు రఘునాయక్, సుధాకర్బాబు సోమవారం ఉదయం 8.30 గంటలకు వెళ్లారు.
నిందితుడు దాక్కున్న చోటును చూపించేందుకు ఆటో డ్రైవర్ బాబా వారి వెంట వెళ్లాడు. టీవీ టవర్ ప్రాంతంలోని షికారీ కాలనీలో దాక్కున్న అజయ్, పోలీసులను చూడగానే దాడికి దిగాడు. ఆటో డ్రైవర్ బాబాను కత్తితో పొడిచాడు. పట్టుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుళ్లు, స్థానికులను కత్తితో పొడిచేందుకు ప్రయత్నించాడు. ఎందరు అడ్డుకున్నా దొరక్కుండా టీవీ టవర్ వెనుక వైపు ఉన్న చెరువు వద్దకు, అటు నుంచి ఆకుతోటపల్లి వైపు పరుగు తీశాడు. తీవ్రంగా గాయపడిన బాబాను పోలీసులు అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఛేజింగ్...ఫైరింగ్...
అజయ్ని సీఐ శ్రీకాంత్, మరికొందరు పోలీసులు వెంబడించారు. ఆకుతోటపల్లి వైపు పరుగులు తీసుశారు. ఆకుతోటపల్లి-కందుకూరు మధ్య చెరుకుతోట సమీపంలో భారీగా గడ్డి పొదలు ఉన్నాయి. అందులో అజయ్ దాక్కున్నాడు. పోలీసులు రౌండప్ చేశారు. బయటకు వచ్చి లొంగిపోవాలని సీఐ శ్రీకాంత్ యాదవ్ హెచ్చరిస్తూ.. గడ్డి పొదల్లోకి వెళ్లారు. అక్కడ నక్కి ఉన్న నిందితుడు ఒక్కసారిగా సీఐపై దాడి చేసి, కత్తితో పొడిచారు. సీఐ చేతికి గాయం కావడంతో తన వద్ద ఉన్న 9 ఎంఎం పిస్టల్ తీసి గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా మీదకు వస్తుండటంతో అతడి కుడి కాలుకు గురిపెట్టి కాల్చారు. బుల్లెట్ మోకాల్లోంచి దూసుకెళ్లడంతో నిందితుడు కిందపడిపోయాడు. కత్తి వేటకు తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో గడ్డి పొదల నుంచి బయటకొచ్చిన సీఐ, కేకలు వేశారు. దీంతో కానిస్టేబుళ్లు పరుగున వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. తీవ్రంగా గాయపడిన సీఐ శ్రీకాంత్కు సైతం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందించారు. ఎస్పీ జగదీష్ ఆయనను పరామర్శించారు.
రెండు బుల్లెట్ షెల్స్, కత్తి స్వాధీనం
దేవరకొండ అజయ్పై జిల్లా పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. చాకలి రాజాపై కత్తితో దాడి చేయడంతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీవీ టవర్ వద్ద ఆటో డ్రైవర్ బాబాపై కత్తితో దాడి చేయడంతో వన్టౌన్ పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఆకుతోటపల్లి వద్ద సీఐ శ్రీకాంత్పై దాడి చేయడంతో ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫైరింగ్ జరిగిన ప్రాంతంలో రెండు బుల్లెట్ షెల్స్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు.నిందితుడి వయసు 18 సంవత్సరాల 4 నెలలు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తారు. అజయ్ మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు పట్టించుకోవడం మానేశారు.
టీడీపీ నేతల పరామర్శ
తీవ్రంగా గాయపడిన సీఐ శ్రీకాంత్కు ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ ఫోన్ చేసి మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. టీడీపీ నాయకులు గంగారామ్, సుధాకర్ యాదవ్, బోయపాటి అశోక్, సాకే లక్ష్మీనరసింహ, మోహన్కుమార్ తదితరులు ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇచ్చంపల్లి నుంచి తరలిస్తే మహారాష్ట్రకు ముంపు!
Read Latest Telangana News and National News