MP Lavu Sri Krishna Devarayalu: వైసీపీ భూ కుంభకోణాన్ని ఎండగట్టిన ఎంపీ
ABN , Publish Date - Mar 11 , 2025 | 05:08 PM
MP Lavu Sri Krishna Devarayalu: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు విమర్శించారు. ఈ అక్రమాల వల్ల భూములు కోల్పోయిన వారికి .. తిరిగి భూములు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి ఆయన కీలక సూచనలు చేశారు.

న్యూఢిల్లీ, మార్చి 11: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భారీగా భూ కుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు విమర్శించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని నిజమైన యజమానులకు భూ హక్కులు పునరుద్ధరించేందుకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం లోక్సభలో జీరో అవర్లో గత జగన్ ప్రభుత్వంలో రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై ఆయన గళం విప్పి.. వాటిని ఎండగట్టారు. 40 వేల ఎకరాల అసైన్డ్ భూములను అక్రమంగా ఫ్రీహోల్డ్గా మార్చారని ఆరోపించారు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.14,831 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.
అలాగే గత వైసీపీ పాలనలో.. కేంద్ర నిధుల దుర్వినియోగంపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని ఈ సందర్భంగా కేంద్రాన్ని ఆయన కోరారు. ఏపీ ప్రభుత్వం సవరించిన కొత్త ల్యాండ్ రీ సర్వే, టైట్లింగ్ యాక్ట్కు అనుమతి తెలపాలని కేంద్రానికి ఆయన కీలక సూచిన చేశారు. ఇక సరిహద్దు రాళ్లకు వైఎస్ జగన్ బొమ్మ వేయడం ద్వారా రూ.700 కోట్ల ప్రజా ధనాన్ని వృథా చేశారని మండిపడ్డారు. అలాగే అక్రమంగా కేటాయించిన నిషేధిత భూములతో ఇళ్ల స్థలాల పట్టాల పథకం కింద రూ.3 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు సోదాహరణగా వివరించారు.
Also Read: నా చేతిలో కత్తి పెట్టి..
మరోవైపు నకిలీ పత్రాలతో విశాఖ,తిరుపతి,చిత్తూరులో రూ.4,939కోట్ల విలువైన పట్టణ భూములను కబ్జా చేశారని విమర్శించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2022లో మార్పులు చేయడం ద్వారా తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తన విధేయులకు వైసీపీ భూములు కట్టబెట్టిందని టిడిపి ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అందంగా ఉందని ప్రియురాలిని చంపేశాడు..
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో చోటు చేసుకున్న పలు అక్రమాలపై కూటమి ప్రభుత్వం విచారణ జరుపుతోంది. అందులోభాగంగా ఇప్పటికే పలు అవినీతి, అక్రమాలపై బహిర్గతం చేసింది. ఇక గత ప్రభుత్వ పాలనలో భూ కుంభకోణాలు మాత్రం లెక్కకు మిక్కిలిగా జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. అందులో పార్టీకి చెందిన పలువురు కీలక నేతల పేర్లు సైతం వెలుగులోకి వచ్చాయి. ఇక జగన్ పాలనలో మూడు రాజధానుల ప్రకటన చేసి.. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి అంటూ కీలక ప్రకటన అయితే నాటి సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేశారు.
కానీ వాటి కోసం ఆయన చేపట్టిన చర్యలు అయితే ఏమి లేవన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్రలో సైతం భారీగా భూములను ఆ పార్టీ నాయకులు ఆక్రమించుకొన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ తరహా ఆరోపణలు నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వలో జరిగిన భూ కుంభకోణాలను బట్టబయలు చేయాలంటూ లోక్ సభలో టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కేంద్రాన్ని కోరారు.
For Andhrapradesh News and Telugu News