MLC Elections : ఐదూ కూటమి ఖాతాలోకే!
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:56 AM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్బాబు, బి.తిరుమల (బీటీ) నాయుడి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది.
ఎమ్మెల్యే కోటా ‘మండలి’ సీట్లలో ఒకటి జనసేనకు.. పవన్ సోదరుడు నాగబాబుకు ఖాయం!
ఎమ్మెల్యే కోటా ‘మండలి’ సీట్లలో ఒకటి జనసేన నుంచి నాగబాబుకు!
మిగతా 4 సీట్లకు టీడీపీలో భారీగానే పోటీ
ఆశావహుల్లో దేవినేని, కొమ్మాలపాటి, బుద్ధా వెంకన్న, ఎండీ నజీర్, మరికొందరు
బడ్జెట్ తర్వాత దృష్టిపెట్టనున్న చంద్రబాబు
సంఖ్యాబలం లేని వైసీపీ పోటీకి దూరం?
బరిలోకి దిగే అవకాశాలు లేనట్లే
అమరావతి, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ సోమవారం విడుదలైన నేపథ్యంలో టీడీపీలో ఆశావహులు, నేతల్లో సందడి మొదలైంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలుగా ఉన్న యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్బాబు, బి.తిరుమల (బీటీ) నాయుడి పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఖాళీ అవుతున్న ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక స్థానాన్ని జనసేనకు కేటాయించనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును కేబినెట్లోకి తీసుకుంటామని ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాక మంత్రి పదవి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు ఒక సీటు ఖాయమైంది. మిగిలిన నాలుగు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులే పోటీచేయనున్నారు. వీటి కోసం ఆ పార్టీలో చాలా మంది పోటీపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికలో ప్రాంతాలు, కులాల సమీకరణలను పరిగణనలోకి తీసుకోవడంతోపాటు పొత్తులో భాగంగా సీట్లు త్యాగం చేసిన వారికి, వైసీపీ నుంచి వచ్చిన వారికి చంద్రబాబు ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. వీరిలో పలువురికి ఆయన గతంలోనే హామీ ఇచ్చారు. అలాంటి వారిలో పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం అసెంబ్లీ సీటును త్యాగం చేసిన ఎస్వీఎ్సఎన్ వర్మ ముందు వరుసలో ఉన్నారు. అయితే ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తే ఆ నియోజకవర్గంలో మరో అధికార కేంద్రం ఏర్పడుతుందని జనసైనికులు భావిస్తున్నారు. జనసేన నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తమైతే తప్ప వర్మకు కేటాయింపులో పెద్దగా అవరోధాలు లేవు.
మిగిలిన మూడు స్థానాలకు మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బీసీ కోటాలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, మైనారిటీ కోటాలో విశాఖపట్నంకు చెందిన ఎండీ నజీర్ వంటి వారు పోటీపడుతున్నారు. భాష్యం ప్రవీణ్ కోసం పెదకూరపాడు స్థానాన్ని కొమ్మాలపాటి, వసంత కృష్ణ ప్రసాద్ కోసం మైలవరం సీటును దేవినేని త్యాగం చేసిన సంగతి తెలిసిందే. మున్ముందుపోటీదారుల జాబితా మరింత పెరిగే అవకాశం ఉంది. 28న బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత సీఎం అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు మార్చి 21 వరకు జరగనుండగా.. ఎమ్మెల్సీ ఎన్నిక మార్చి 20న జరుగనుంది. వైసీపీకి సభలో సంఖ్యాబలం లేనందున పోటీచేసే అవకాశాలు తక్కువే. ఏకగ్రీవానికే ఎక్కువ చాన్సు ఉందని కూటమి వర్గాలు చెబుతున్నాయి.