Share News

CID Probe: ధర్నా చేయడానికి వెళుతున్నట్టు చెప్పారు

ABN , Publish Date - May 10 , 2025 | 03:43 AM

టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ విచారణకు హాజరైన సజ్జల, అవినాశ్‌ ‘తెలీదు, సంబంధం లేదు’ అని సమాధానమిచ్చారు. వీడియోలు, సాక్ష్యాలున్నా ప్రశ్నలకు దాటవేత ధోరణి, అనుచరుల గురించి అవినాశ్‌ చేసిన అభ్యాస వాదనలు గమనార్హం

CID Probe: ధర్నా చేయడానికి వెళుతున్నట్టు చెప్పారు

టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలియదు.. సీఐడీ విచారణలో సజ్జల వెల్లడి.. చాలా ప్రశ్నలకు దాటవేత ధోరణి

  • నాకు అనుచరులే లేరు..దాడిలో పాల్గొనలేదు

  • విచారణలో దేవినేని అవినాశ్‌ తీరు

గుంటూరు, మే 9 (ఆంధ్రజ్యోతి) : ‘తెలియదు..సంబంధం లేదు’’.. మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ సీఐడీ విచారణను ఎదుర్కొన్న తీరు ఇది. అప్పటి దాడి దృశ్యాలను చిత్రీకరించిన వీడియోలను ముందుపెట్టి ప్రశ్నించినా.. అదే దాటవేత ధోరణిలో వారిద్దరూ మాట్లాడారు. జగన్‌పై టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన అభిమానులు టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి వెళుతున్నారని తనకు చెప్పారని సజ్జల విచారణాధికారులకు తెలిపినట్టు సమాచారం. అవినాశ్‌ కూడా దాదాపు ఇదే సమాధానం ఇప్పినట్టు తెలిసింది. వైసీపీ హయాంలో 2021 అక్టోబరు 19వ తేదీన మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై వైసీపీకి చెందిన అరాచక శక్తులు, రౌడీలు దాడి చేసిన విషయం తెలిసిందే. గుంటూరు సీఐడీ కార్యాలయంలో జరిగిన ఈ కేసు విచారణకు సజ్జల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాశ్‌ హాజరయ్యారు. ఉదయం 11.40 గంటల నుంచి 12.40 గంటల వరకు సజ్జలను, ఆ తర్వాత మరో గంటపాటు అవినాశ్‌ను విచారించారు.


విచారణలో సజ్జల తీరు...

సీఐడీ: టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడిని తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నుంచి మీరు పర్యవేక్షించారు కదా?

సజ్జల: ఆ రోజు నేను బద్వేల్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నాను. దాడి సంగతి నాకు తెలియదు.

ప్రశ్న : ఆరోజు బద్వేల్‌లో ఉన్నట్లు ఆధారాలు చూపగలరా?

సజ్జల: ఆధారాలను తర్వాత అందిస్తాను

సీఐడీ: వైసీపీలో కీలకంగా ఉన్న మీ ఆదేశాలు లేకుండానే దాడి జరుగుతుందా?

సజ్జల: నేనుగానీ, మా పార్టీ నాయకులు గానీ దాడికి ఆదేశాలు ఇవ్వలేదు. ఆ దాడితో నాకు సంబంధం లేదు.

సీఐడీ: మీ ఆదేశాలతోనే కేసును నాడు పోలీసులు నీరుగార్చారు కదా?

సజ్జల: నాకు ఎటువంటి సంబంధం లేదు.

సీఐడీ: టీడీపీ కార్యాలయంపై దాడికి కారణం?

సజ్జల: జగన్‌ను టీడీపీ నేత పట్టాభి దూషించడంతో ఆయన అభిమానులు కలత చెంది దాడి చేసి ఉంటారు.

సీఐడీ: దాడి విషయం మీకు ముందే తెలుసు కదా?

సజ్జల: తెలియదు. జగన్‌ను పట్టాభి దూషించడంపై మనస్తాపం చెందిన అభిమానులు టీడీపీ కార్యాలయం ఎదుట ధర్నా చేయడానికి వెళుతున్నట్లు చెప్పారు.


మా వాళ్లు లేరు: అవినాశ్‌

సీఐడీ: టీడీపీ కార్యాలయంపై దాడి లో మీ ఆదేశాలతో మీ అనుచరులే కీలకంగా వ్యవహరించారు కదా?

అవినాశ్‌: నాకు సంబంధం లేదు, నా అనుచరులెవరూ దాడిలో పాల్గొనలేదు. నాకు అనుచరులే లేరు.

సీఐడీ: మీ అనుచరులే దాడి చేసినట్లు సాక్షులు చెప్పారు.

అవినాశ్‌: ఆ దాడిలో నేను లేను. మా వాళ్లు కూడా ఎవరు వెళ్లలేదు. (దా డికి పాల్పడిన అవినాశ్‌ అనుచర ుల ఫొటోలు ముం దుపెట్టగా..) నాకు తెలి యదు. వాళ్లను నేను గుర్తు పట్టలేను.

సీఐడీ: మీ ఆదేశాల ప్రకారం విజయవాడ,గుంటూరు నుంచి వచ్చిన మీ అనుచరులు దాడిచేసినట్టు సాక్షులు చెప్పారు

అవినాశ్‌: దాడి చేయమని నేను ఎవరికీ చెప్పలేదు. ఆ విషయం నాకు తెలియదు.


రెడ్‌బుక్‌ పాలన పెరుగుతోంది

  • సజ్జల

‘‘మీరు నాటుతున్న విత్తనం మరీ ప్రమాదకరమైంది. దాని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుందంటూ ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణ అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో విచారణకు పిలిస్తే వచ్చానని తెలిపారు. ఆ దాడి విషయం తనకు తెలియదని, అదే విషయం విచారణాధికారులకు తెలిపానని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్రంలో రోజురోజుకీ రెడ్‌ బుక్‌ పాలన పెరిగిపోతోందన్నారు. కాగా, సుప్రీంకోర్టు ఆదేశంతో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికి రెండుసార్లు విచారణకు హాజరయ్యానని వైసీపీ నేత దేవినేని అవినాశ్‌ మీడియాకు తెలిపారు. ఆ దాడితో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

Updated Date - May 10 , 2025 | 03:43 AM