Polavaram Project: నిపుణుల మాటకే ఓటు
ABN , Publish Date - Jan 21 , 2025 | 05:33 AM
పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం విషయంలో అంతర్జాతీయ నిపుణుల సూచనలకే కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసింది.
టీ-16 మిశ్రమం వాడాలని ఆదేశం
పీపీఏ ద్వారా జల వనరుల శాఖకు
జల సంఘం సమాచారం
అమరావతి/ఏలూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన డయాఫ్రం వాల్ ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమం విషయంలో అంతర్జాతీయ నిపుణుల సూచనలకే కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేసింది. వారు సిఫారసు చేసిన టీ-16 మిశ్రమం వాడాలని నిర్ణయించి రాష్ట్రప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇచ్చేసింది. సోమవారం ఢిల్లీలో జలసంఘం అంతర్గత సమావేశం జరిగింది. ఇందులో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్సఎంఆర్ఎస్) చెప్పినట్లుగా టీ-5 మిశ్రమం కాకుండా.. అమెరికా, కెనడా నిపుణులు సూచించిన టీ-16ను మాత్రమే వాడాలని తీర్మానించి.. పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ద్వారా రాష్ట్ర జల వనరుల శాఖకు సమాచారం చేరవేసింది. దీంతో మంగళవారం నుంచి టీ-16 మిశ్రమంతో నిర్మాణ పనులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థ బావర్ సన్నద్ధమైంది. మరోవైపు.. ప్రాజెక్టు క్షేత్రంలో డయాఫ్రం వాల్ పనులు మరింత ఊపందుకున్నాయి. రెండ్రోజుల కిందట ట్రెంచ్ కట్టర్ ద్వారా భూమి అంతర్భాగంలో ఉన్న మట్టి, ఇసుక, రాతి తవ్వకాల పనులు ప్రారంభించారు. సోమవారం మూడోరోజు కూడా అవి కొనసాగాయి. ఎర్త్ కం రాక్ఫిల్ (ఈసీఆర్ఎఫ్) డ్యాం ప్రాంతంలో డీవాల్ గైడ్బండ్ కాంక్రీటు గోడల మధ్య.. ట్రెంచ్ కటింగ్ యంత్రంతో బెంజోనైట్ ద్రవాన్ని పంపుతూ భూగర్భంలో ఉన్న రాతి పొరల వరకూ తవ్వకాలు చేస్తున్నారు. ఏ మిశ్రమం వాడాలో స్పష్టత వచ్చేవరకూ వేచి ఉండాలని జలసంఘం సూచించడంతో వాల్ నిర్మాణం నిలిచిపోయిందన్న వార్తల్లో వాస్తవం లేదని ప్రాజెక్టు సీఈ నరసింహమూర్తి స్పష్టం చేశారు. పనులు యథావిధిగా కొనసాగుతున్నాయన్నారు. 1.5 కిమీ కాంక్రీటు గైడ్ వాల్ నిర్మాణం చేయాల్సి ఉండగా.. ఇప్పటికే 80 మీటర్లు పూర్తయిందని, మిగిలిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు.