Share News

Anantapur: మద్యం ప్రియులకో గుడ్ న్యూస్.. ఇక రాత్రి 12 వరకూ..

ABN , Publish Date - Aug 19 , 2025 | 10:02 AM

కొత్త బార్‌ పాలసీ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమలవుతుందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఉమ్మడి అనంతపురం జిల్లా డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య పేర్కొన్నారు.

Anantapur: మద్యం ప్రియులకో గుడ్ న్యూస్.. ఇక రాత్రి 12 వరకూ..

- 1 నుంచి కొత్త బార్‌ పాలసీ

- ఉమ్మడి జిల్లాలో 30 బార్లకు దరఖాస్తుల ఆహ్వానం

- ఈ నెల 26 వరకు గడువు

- ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డీసీ నాగమద్దయ్య

అనంతపురం: కొత్త బార్‌ పాలసీ సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి అమలవుతుందని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఉమ్మడి అనంతపురం(Anantapur) జిల్లా డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య పేర్కొన్నారు. సోమవారం అనంతపురంలోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో సూపరింటెండెంట్‌ రామ్మోహన్‌రెడ్డి, ఇతర అధికారులతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీ నాగమద్దయ్య మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం 2025-2028 సంవత్సరాలకు కొత్త బార్‌ పాలసీ తీసుకొచ్చిందన్నారు.


ఆ మేరకు బార్ల లైసెన్సుల కోసం సోమవారం నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. అనంతపురం జిల్లాలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 9 బార్లు, గుంతకల్లులో 3, తాడిపత్రిలో 4, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గంలో ఒకటి చొప్పున బార్లు ఉన్నాయని, సత్యసాయి జిల్లాలో హిందూపురంలో 3, ధర్మవరంలో 3, కదిరిలో 3, పెనుకొండ, మడకశిరలో ఒకటి చొప్పున ఉన్నాయని వివరించారు. మొత్తం 30 బార్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో బార్లను వేలం పద్ధతిలో కేటాయించే వారని, ప్రస్తుతం లాటరీ డ్రా విధానంలో కేటాయిస్తామని అన్నారు.


2022-25 బార్‌ పాలసీలో జనాభా స్లాబ్‌ మేరకు బార్లకు దరఖాస్తు ఫీజు రూ. 5 లక్షలు, రూ.7.5 లక్షలు, రూ. 10 లక్షలు ఉండేదన్నారు. కొత్త విధానంలో దరఖాస్తు ఫీజు అన్నింటికి రూ. 5 లక్షలు, ప్రాసెసింగ్‌ ఫీజు రూ.10వేలు నిర్ణయించారని తెలిపారు. పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి బార్‌కు కనీసం నాలుగు దరకాస్తులు రావాలన్న షరతును ప్రభుత్వం విధించిందన్నారు. 50 వేలలోపు జనాభా ఉన్న బార్లకు లైసెన్స్‌ ఫీజు రూ. 35 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న బార్లకు రూ. 55 లక్షలు, 5 లక్షల పైబడిన జనాభా ఉన్న బార్లకు రూ.


75 లక్షల ఫీజును ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో ఉన్న ఫీజులతో పోలిస్తే భారీగా తగ్గించారని అన్నారు. కొత్త బార్ల నిర్వహణ సమయాన్ని కూడా పెంచారన్నారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకూ నడపవచ్చు అన్నారు. లైసెన్సు ఫీజును ఆరు వాయిదాల్లో చెల్లించవచ్చునని తెలిపారు. గతంలో ముందే రెస్టారెంట్‌ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉండేదని, కొత్త విధానంలో లైసెన్సు వచ్చిన 15 రోజుల వరకు గడువు ఉంటుందని స్పష్టం చేశారు.


ఈ నెల 26వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్లలో వేయవచ్చు అన్నారు. దరఖాస్తులను రెండు జిల్లాల్లోని ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయాల్లో అందజేయాలన్నారు. 28వ తేదీ లాటరీ డ్రా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అనంతపురం సీఐ సత్యనారాయణ, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

గుడ్‌న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

విద్యుత్‌ షాక్‌తో తండ్రీకొడుకుల మృతి

ఎమ్మెల్సీ కవిత ఒంటరేనా!?

Read Latest Telangana News and National News

Updated Date - Aug 19 , 2025 | 10:10 AM