Police Misconduct: నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పోలీసుల దాష్టీకం
ABN , Publish Date - Aug 04 , 2025 | 11:26 AM
నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. పని చేసుకుంటున్న ఓ గ్రామస్థుడిని విచారణ పేరుతో బలవంతంగ పోలీస్ స్టేషన్కు తరలించడంతో ఆ వ్యక్తికి గుండెపోటు వచ్చింది.
నెల్లూరు జిల్లా: వరికుంటపాడులో మైనింగ్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న ఓ గ్రామస్థుడిపై పోలీసుల దురుసు ప్రవర్తన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మండలానికి చెందిన షేక్ పీరయ్య అనే వ్యక్తిని, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కి బలవంతంగా తరలించిన పోలీసుల ప్రవర్తన వల్ల, అతడు గుండెపోటుకు గురయ్యాడు. మైనింగ్ వద్దు గ్రామమే ముద్దు అనే కార్యక్రమంలో గ్రామస్తులతో కలిసి పాల్గొన్న పీరయ్య, ఇటీవల మూడు రోజులుగా ఎస్సై ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులకు గురవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సోమవారం ఉదయం పీరయ్య పొలంలో పని చేస్తున్న సమయంలో పోలీసులు వచ్చి అతన్ని విచారణ పేరుతో స్టేషన్కి తీసుకెళ్లారు. అయితే, టాబ్లెట్ కూడా వేసుకోనివ్వకుండా బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్టేషన్లోకి తీసుకెళ్లిన కొద్ది సేపటికే పీరయ్య తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలాడు. గుండెపోటుతో పడిపోవడంతో 108 అంబులెన్స్ ద్వారా తొలుత ప్రాథమిక చికిత్స, అనంతరం మెరుగైన వైద్యం కోసం ఒంగోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పీరయ్యపై పోలీసుల వేధింపులను తీవ్రంగా ఖండించిన మైనింగ్ వ్యతిరేక జేఏసీ, ఇది ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా పేర్కొంది. గ్రామస్తులను ఇలా భయభ్రాంతులకు గురిచేయడం బాధాకరమని మండిపడ్డారు. ఇక ఈ ఘటన నేపథ్యంలో వరికుంటపాడు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో స్టేషన్కి చేరుకొని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:
కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అయితే ఏమి చేయాలి?
కాకినాడలో దారుణం.. భార్యభర్తలపై నాటు తుపాకీతో కాల్పులు
For More Latest News