AP Politics: సీఎంతో భేటీ.. ఆయనకు ఎమ్మెల్సీ ఖాయమేనా..
ABN , Publish Date - Mar 04 , 2025 | 05:49 PM
MLA Quota MLC Elections: ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఎమ్మెల్సీ సీటు దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో సీఎంను కలిసి తమ ప్రయత్నం తాము చేస్తున్నారు. మరి ఎమ్మెల్సీ సీటు ఎవరికి దక్కుతుందో..
అమరావతి, మార్చి 04: ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత్తం ఎమ్మెల్యే ఎన్నికల జాతర నడుస్తోంది. ఇప్పటికే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసి, ఫలితాలు వస్తుండగ.. ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం నడుస్తోంది. ఈ కోటాలో తమ సీటు కన్ఫామ్ చేసుకునేందుకు తెలుగు దేశం పార్టీలోని సీనియర్ నేతలంతా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు ఎమ్మెల్యే ఆశావహులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసెంబ్లీ లాబీల్లో చక్కర్లు కొడుతూ హంగామా చేస్తున్నారు.
ఇదిలాఉంటే.. తాజాగా సీఎం చంద్రబాబుతో కొమ్మాలపాటి శ్రీధర్ సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఇస్తామనీ సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎంను కొమ్మాలపాటి భేటీ కావడం.. ఎమ్మెల్సీ కన్ఫామ్ అయినట్లు అర్థమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. భాష్యం ప్రవీణ్కు టికెట్ కేటాయించారు. దీనికి బదులుగా కొమ్మాలపాటి శ్రీధర్కు ఎమ్మెల్సీ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధినేతపై నమ్మకంతో.. ఎలాంటి వివాదం లేకుండా తన నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లాలోని 7 స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేశారు. కొమ్మాలపాటి కష్టాన్ని గుర్తించిన అధిష్టానం.. ఆయనకు ఎమ్మెల్సీ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది.
ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగనుండగా.. జనసేన నుంచి నాగబాబు పేరు ఇప్పటికే ఫిక్స్ అయ్యింది. వంగవీటి మోహనరంగా పేరు కూడా ఎమ్మెల్సీగా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. పిఠాపురం టీడీపీ నేత ఎస్ వి ఎస్ వర్మకు కూడా ఎమ్మెల్సీ ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంటే.. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 4 స్థానాలకు అభ్యర్థుల పేర్లు అనధికారికంగా ఖరారయ్యాయి.
5 స్థానాలకు పోలింగ్..
ఏపీలో ఐదు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది. నామినేషన్ల స్వీకరణకు మార్చి 10 చివరి తేదీ. మార్చి 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. మార్చి 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. మార్చి 20న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఎన్నికలకు సంబంధించి ముఖ్యమైన తేదీలు..
ఎన్నికల నోటిఫికేషన్ జారీ: మార్చి 3.
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మార్చి 10.
నామినేషన్ల పరిశీలన: మార్చి 11 వరకు.
నామినేషన్ల ఉపసంహరణ: మార్చి 13 వరకు.
పోలింగ్: మార్చి 20.. అదే రోజు సాయంత్రం 5 తర్వాత ఓట్ల లెక్కింపు.