Share News

Vijayawada Krishna River: కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి

ABN , Publish Date - Aug 28 , 2025 | 06:20 PM

మచిలీపట్నంలో కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.

Vijayawada Krishna River: కృష్ణానదికి పెరిగిన వరద ఉధృతి
Vijayawada Krishna River

మచిలీపట్నం: రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో కృష్ణానదికి వరద ప్రవాహం మెల్లమెల్లగా పెరుగుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ నదీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలిపారు.


ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల

మరోవైపు పైనుంచి వస్తున్న నీటి కారణంగా ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో ఇప్పటికే 3.26 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేట్ నుంచి దిగువకు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తోట్లవల్లూరు ప్రాంతంలో ప్రత్యేకంగా SDRF (State Disaster Response Force) టీమ్ సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాదాన్ని ముందుగానే నివారించేందుకు జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందన్నారు.


జాగ్రత్తలు తీసుకోండి

బుడమేర ముంపు ప్రాంతంలోని ప్రజలను ముందుగానే హెచ్చరించినట్లు కలెక్టర్ వెల్లడించారు. వరద నీరు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉన్నందున, ఆ ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.


లంక గ్రామాల తరలింపు

కృష్ణా నదికి ఆనుకుని ఉన్న లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ప్రయాణ వాహనాలు, తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు, తాగునీరు, వైద్య సదుపాయాలు అన్ని సిద్ధం చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నది ఒడ్డున, లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారుల సూచనలను పాటించాలని కోరారు. ఎవరూ వాగులు, వరద నీటిని దాటే ప్రయత్నం చేయకూడదని హెచ్చరించారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రభుత్వం తరఫున అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.


Also Read:

హైదరాబాద్‌లో మరికాసేపట్లో భారీ వర్షం..

గోధుమ లేదా జొన్న రోటీ.. ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది?

For More Latest News

Updated Date - Aug 28 , 2025 | 07:50 PM