Dasara Navaratri: రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
ABN , Publish Date - Sep 23 , 2025 | 09:29 AM
గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు.
విజయవాడ, సెప్టెంబర్ 23: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు గాయిత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి అమ్మవారిని ఈరోజు (మంగళవారం) పలువురు మంత్రులు దర్శించుకున్నారు. హోం మినిస్టర్ వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి, పరిటాల సునీత, యార్లగడ్డ వెంకట్రావు దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానంతరం మంత్రులు వేద పండితుల చేత వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అమ్మవారి లడ్డు ప్రసాదాన్ని, చిత్రపటాన్ని మంత్రులకు ఆలయ అధికారులు అందజేశారు.
మరోవైపు గాయత్రీ దేవి అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే అమ్మ దర్శనం కోసం భక్తులు తరలివచ్చారు. జై దుర్గా జై జై దుర్గా అన్న నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. ఈ ఏడాది 11 అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు దుర్గమ్మ. తొలిరోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వగా.. మొదటి రోజే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని.. దుర్గమ్మ రూపాన్ని కనులారా నింపుకుని తరించిపోయారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
బ్రహ్మచారినిగా భ్రమరాంబాదేవి
అటు... నంద్యాల జిల్లాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కూడా దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు బ్రహ్మచారిని అలంకారంలో శ్రీ భ్రమరాంబాదేవి భక్తులకు దర్శనమిస్తున్నారు. సాయంత్రం స్వామి అమ్మవార్లకు మయూర వాహనసేవ పురవీధుల్లో ఊరేగించనున్నారు.
ఇవి కూడా చదవండి...
విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
Read Latest AP News And Telugu News