Constructing Statues Public Funds: విగ్రహాల కోసం ప్రజల డబ్బు వాడొద్దు.. ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..
ABN , Publish Date - Sep 23 , 2025 | 07:36 AM
ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా, ఈ పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బెంచ్ మద్దతు ఇచ్చింది.
తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎమ్కే ప్రభుత్వానికి భారత అత్యున్నత న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల సొమ్మువాడొద్దని ఆదేశించింది. ‘మీ మాజీ నాయకులను కీర్తించటం కోసం ప్రజా ధనాన్ని ఎందుకు వాడుతున్నారు. ఇందుకు అనుమతి లేదు’ అని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం తిరునెల్వేలి జిల్లా వల్లియూర్ కూరగాయల మార్కెట్ ప్రవేశ ద్వారం ముందు దివంగత నేత కరుణానిధి విగ్రహం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
కొన్ని నెలల క్రితమే విగ్రహ ఏర్పాటు పనులు మొదలయ్యాయి. ప్రభుత్వం 30 లక్షల దాకా ఖర్చు పెట్టింది. అయితే, ఇలాంటి సమయంలో విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్కు సానుకూలంగా స్పందించింది. పబ్లిక్ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకూడదని హైకోర్టు పేర్కొంది. కొన్ని సందర్భాల్లో విగ్రహాల కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. విగ్రహ ఏర్పాటును ఆపాలని తీర్పునిచ్చింది.
అయితే, ప్రభుత్వం హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా, ఈ పిటిషన్పై ఇద్దరు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు బెంచ్ విచారణ జరిపింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పుకు బెంచ్ మద్దతు ఇచ్చింది. ప్రభుత్వంపై మండిపడింది. మాజీ నాయకులను కీర్తించటం కోసం ప్రజా ధనాన్ని ఎలా వాడతారని జస్టిస్ విక్రమ్ నాథ్, ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రశ్నించారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతి ఇవ్వటం కుదరదని స్పష్టం చేశారు. స్పెషల్ లీవ్ పిటిషన్ను వెంటనే వెనక్కు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఊరట కావాలనుకుంటే.. అదీ అవసరం అనుకుంటేనే హైకోర్టును ఆశ్రయించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
నగ్నంగా శ్మశానంలోకి ప్రవేశించి.. మహిళ శవాన్ని బయటకు తీసి..
దేశంలో మూడింట రెండు వంతులు పనిచేసే వయసువారే