CM Chandrababu Heavy Rains: భారీ వర్షాలు.. అత్యవసర నిధుల మంజూరుకు సీఎం ఆదేశం
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:58 PM
నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, అక్టోబర్ 23: దుబాయ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నప్పటికీ రాష్ట్రంలో వర్ష ప్రభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu). తాజాగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రభావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధుల మంజూరుకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచనలు చేశారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు సీఎంకు కలెక్టర్లు వివరించారు. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని.. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని సీఎం ఆదేశించారు. పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
ఇవి కూడా చదవండి..
అలర్ట్గా ఉండండి.. ప్రజలు ఇబ్బంది పడొద్దు: మంత్రి నారాయణ
అబుదాబీలో వరుస భేటీలు.. పెట్టుబడులపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్
Read Latest AP News And Telugu News