International Day For Eradication Of Poverty: పీ4లో భాగస్వాములవ్వండి.. పేదరికాన్ని నిర్మూలించండి: చంద్రబాబు
ABN , Publish Date - Oct 17 , 2025 | 03:29 PM
16 నెలల్లో 1 లక్ష కోట్ల రూపాయలకు మించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నా సీఎం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెలనెలా రూ.2,758 కోట్లతో ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు’ అందిస్తున్నామని తెలిపారు.
అమరావతి, అక్టోబర్ 17: పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సాయం చేయడం కాదని... వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం, ఎదగడానికి అవకాశాలను కల్పించడమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఈరోజు (శుక్రవారం) అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినోత్సవం సంద్భంగా సామాజిక మాద్యమం ఎక్స్ వేదికగా సీఎం స్పందించారు. పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తొలిరోజు నుంచి పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అలాగే పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
చంద్రబాబు ట్వీట్..
‘ఈరోజు అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం. పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సాయం చేయడం కాదు... వారి ఆత్మగౌరవాన్ని కాపాడటం, ఎదగడానికి అవకాశాలను కల్పించడం, అందరితో సమానంగా ముందుకు నడిపించడం. స్వర్ణాంధ్ర విజన్ 2047 లోని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన. ఆ లక్ష్యాన్ని చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచి పనిచేస్తోంది. 16 నెలల్లో 1 లక్ష కోట్ల రూపాయలకు మించిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా నెలనెలా రూ.2,758 కోట్లతో ‘ఎన్టీఆర్ భరోసా పింఛన్లు’ అందిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 207 'అన్న క్యాంటీన్లు' పునఃప్రారంభించి 5 రూపాయలకే పేదల ఆకలి తీరుస్తున్నాం. 'దీపం 2.0' పథకంతో పేదింటి మహిళలకు ఏడాదికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పేదింటి పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో ఇంట్లో ఎంత మంది చదువుతుంటే అంతమందికి 'తల్లికి వందనం' కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. 'స్త్రీ శక్తి' పథకం ద్వారా ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతులకు 'అన్నదాత సుఖీభవ' పథకం కింద మొదటి విడతగా రూ.7,000లు జమ చేశాం. 'మత్స్యకారుల సేవలో' పథకం కింద రూ.246 కోట్లు, ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమం కింద రూ.435 కోట్లు ఇచ్చాం. ఇలా సంక్షేమ పథకాలు ఇస్తూనే పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంచుకున్న మార్గమే 'పి-4 జీరో పావర్టీ' కార్యక్రమం. అంతర్జాతీయ పేదరిక నిర్మూలన దినం సందర్భంగా ఈ లక్ష్యానికి మనందరం పునరంకితమవుదాం అని పిలుపునిస్తూ.... పీ-4 కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు.
ఇవి కూడా చదవండి...
నకిలీ మద్యం కేసులో నిందితుల విచారణ.. నిజాలు బయటకు వచ్చేనా
మెడికల్ కాలేజీలను పీపీపీతో చేస్తే తప్పేంటి?: మంత్రి సత్యకుమార్
Read Latest AP News And Telugu News