CM Chandrababu Naidu: సీఎంను కలిసిన కేంద్ర బృందం.. తుఫాను నష్టంపై
ABN , Publish Date - Nov 11 , 2025 | 04:47 PM
తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. నష్టాన్ని అంచనా వేసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో కేంద్ర బృందం భేటీ అయ్యింది.
అమరావతి, నవంబర్ 11: మొంథా తుఫాను నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబును (CM Chandrababu) కేంద్ర బృందం కలిసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పాసుమీ బసు నేతృత్వంలో సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో కేంద్ర బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి నష్టాన్ని అంచనా వేసింది. కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వేర్వేరు ప్రాంతాలను సందర్శించింది. రూ.5,267 కోట్ల మేర తుఫాను నష్టం వాటిల్లినట్టు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఓ మధ్యంతర నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. తక్షణ సాయంగా రూ.2,622 కోట్లను మంజూరు చేయాలని కేంద్రాన్ని సర్కార్ కోరింది.
రాష్ట్ర వ్యాప్తంగా 443 మండలాల్లోని 3,109 గ్రామాలు మొంథా తుఫాను కారణంగా ప్రభావితం అయ్యాయని కూటమి ప్రభుత్వం పేర్కొంది. దాదాపు 10 లక్షల మంది తుఫాను, భారీ వర్షాలకు ప్రభావితం అయ్యారని నివేదికలో వెల్లడించింది. 9960 ఇళ్లు నీట మునిగాయని, 1.11 లక్షల కుటుంబాలు నిరాశ్రయులయ్యారని సర్కార్ పేర్కొంది. తుఫానుతో పాటు భారీ వర్షం కారణంగా 4566 ఇళ్లు దెబ్బతిన్నాయని స్పష్టం చేసింది. దాదాపు 1.61 లక్షల హెక్టార్లలో పంట దెబ్బతిందని.. 3.27 లక్షల మంది రైతులు నష్టపోయారని కేంద్రానికి నివేదించింది. వ్యవసాయ పంటలతో పాటు ఆక్వా, పశుసంవర్ధకం, చేనేత రంగం కూడా తీవ్రంగా నష్టపోయినట్టు వెల్లడించింది.
4794 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని, 12,856 విద్యుత్ స్తంభాలు నేల కూలినట్టు స్పష్టం చేసింది. అలాగే 2,318 ట్రాన్సఫార్మర్లు పాడయ్యాయని నివేదికలో పేర్కొంది. మొంథా తుఫాను కారణంగా పంటలు, రహదారులు, ఇళ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు రూ.6,384 కోట్ల మేర నష్టం వాటిల్లిందని వెల్లడించింది. తుఫాను వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు 22 జిల్లాల్లో 1.92 లక్షల మందిని రిలీఫ్ క్యాంపులకు తరలించామని వెల్లడించింది. 3.36 లక్షల కుటుంబాలకు రూ.3 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయంగా అందించినట్టు కేంద్ర బృందానికి ప్రభుత్వం తెలియజేసింది.
ఇవి కూడా చదవండి...
అన్ని జిల్లాల సమాన అభివృద్ధికి కృషి: మంత్రి నారాయణ
కర్నూలుకు అతిపెద్ద బేవరేజెస్ ప్లాంట్.. భారీగా ఉద్యోగాలు: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News