Share News

YS Sharmila: అన్నపై సంచలన కామెంట్లు చేసిన వైఎస్ షర్మిల.. బాబోయ్.. ఇలా అనేశారేంటి..

ABN , Publish Date - Jan 20 , 2025 | 12:04 PM

ఆంధ్రప్రదేశ్: రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ఐదేళ్లపాటు పాలిస్తుంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కనిపించలేదా అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ప్రశ్నించారు. ఇష్టారాజ్యంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా అంటూ ఆమె మండిపడ్డారు.

YS Sharmila: అన్నపై సంచలన కామెంట్లు చేసిన వైఎస్ షర్మిల.. బాబోయ్.. ఇలా అనేశారేంటి..
APCC chief YS Sharmila Reddy

విజయవాడ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah) వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి (YS Sharmila Reddy) అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలన ఓ విపత్తు అని అమిత్ షా అన్నారని, మరి ఐదేళ్లపాటు విధ్వంసం జరుగుతుంటే ఏం చేశారని షర్మిల మండిపడ్డారు. ఆ ఐదేళ్లు కేంద్రంలో ఉన్నది ఎన్డీయేనే కదా మరి ఢిల్లీ(Delhi)లో కూర్చొని వేడుక చూశారా? అంటూ ధ్వజమెత్తారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారా? అంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.


రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని వైసీపీ ఐదేళ్లపాటు పాలిస్తుంటే కేంద్రానికి కనిపించలేదా? అని షర్మిల మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా రూ.10 లక్షల కోట్లు అప్పులు చేస్తుంటే విధ్వంసం జరుగుతున్నట్లు అనిపించలేదా? అని విమర్శించారు. సొంత బాబాయి హత్యకేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం కోసం పోరాటం చేస్తుంటే కేంద్ర హోంశాఖ మంత్రిగా ఎందుకు మౌనంగా ఉన్నారంటూ అమిత్ షాను ఆమె ప్రశ్నించారు. భారీస్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా? అంటూ అమిత్ షాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా అమిత్ షాపై షర్మిల ఘాటుగా స్పందించారు.


ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.." ఐదేళ్లపాటు జగన్ మీకు దత్తపుత్రుడు. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మ. పార్లమెంట్‌లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్. ఏపీలో సహజ వనరులను 'మోదానీ'కి దోచిపెట్టే ఏజెంట్. మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వైసీపీని వాడుకొని, రాష్ట్ర సంపద దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారు. 2019-2024 మధ్య జరిగిన విధ్వంసంలో కర్త జగన్ అయితే.. కర్మ, క్రియ బీజేపీ ప్రభుత్వమే. 10 ఏళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటాం.. రూ.3 లక్షల కోట్లు ఇస్తాం.. పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనం. మీ వ్యాఖ్యలపై మీరు కట్టుబడి ఉంటే.. మీకు దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి. ఈ విషయమై అమిత్ షాను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని" షర్మిల అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ప్రారంభం

పోలీసులపై మాజీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Updated Date - Jan 20 , 2025 | 12:06 PM