Nara Lokesh US Tour: అమెరికా టూర్లో లోకేష్ బిజీ.. ఓప్స్ ర్యాంప్ సీఈవోతో కీలక చర్చలు
ABN , Publish Date - Dec 09 , 2025 | 09:34 AM
మంత్రి నారా లోకేష్ అమోరికా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మతో భేటీ అయిన మంత్రి లోకేష్... ఐటీ, మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.
అమరావతి/శాన్ ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 9: అమెరికా పర్యటనలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రముఖ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో మంత్రి వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఓప్స్ ర్యాంప్ (ops ramp) సీఈవో వర్మతో భేటీ అయిన మంత్రి లోకేష్... ఐటీ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఏపీలో స్మార్ట్ సిటీలు, డిజిటల్ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ల కోసం ఐటీ మౌలిక సదుపాయాల ఆధునీకరణకు మద్దతు ఇవ్వాలని వినతి చేశారు.
ఏఐ ఓప్స్ శిక్షణ, ఇంటర్న్ షిప్లు, ఆర్ అండ్ డి సహకారం కోసం ఏపీ టెక్ అకడమియాతో భాగస్వామ్యం వహించాలని కోరారు. స్కేలబుల్ SaaS మోడల్స్ ద్వారా ఐటీ కార్యకలాపాల నిర్వహణతో పాటు ఏపీలో SMEలు, స్టార్టప్లను ప్రారంభించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.

ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ స్పందిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా తమ సంస్థకు 500+ సంస్థలు కస్టమర్లుగా ఉన్నాయని తెలిపారు. వీటిలో ఫైనాన్స్, హెల్త్కేర్, రిటైల్, టెక్నాలజీలో పాటు ఫార్చ్యూన్ సహా 500 కంపెనీలు ఉన్నాయని వెల్లడించారు. భారతదేశంలోని బెంగళూరు, హైదరాబాద్లో ప్రధాన కేంద్రాల ద్వారా ఏఐ ఓప్స్, క్లౌడ్ నేటివ్ మానిటరింగ్లో ఆవిష్కరణలను ముందుకు తెస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రతిపాదనలను పరిశీలిస్తామని ఓప్స్ ర్యాంప్ సీఈవో వర్మ పేర్కొన్నారు.
అంతకు ముందు అంతర్జాతీయస్థాయి వెంచర్ క్యాపిటల్ సంస్థ సెలెస్టా వీసీ (Celesta VC) మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ను మంత్రి లోకేష్ కలిశారు. విశాఖనగరం ఐటీ, డేటా హబ్గా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని.. ఆంధ్రప్రదేశ్లో సెలెస్టా క్యాపిటల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేయాలని కోరారు. సెమీ కండక్టర్, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని అన్నారు. కంపెనీలకు ఏపీ ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమైన సమగ్ర ప్రోత్సాహకాలను అందిస్తోందని వివరించారు. పరిశ్రమలకు నిర్ణీత సమయంలో నేరుగా ప్రోత్సాహకాలను అందించేందుకు దేశంలోనే తొలిసారిగా ఎస్క్రో ఎకౌంట్ విధానాన్ని ప్రారంభించనునట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు.

మీ ప్రతిపాదనలు పరిశీలిస్తాం: అరుణ్ కుమార్
తాము ప్రధానంగా యూఎస్, ఇండియా, ఇజ్రాయెల్, ఆగ్నేయాసియా దేశాలపై దృష్టిసారిస్తున్నామని సెలెస్టా వీసీ మేనేజింగ్ పార్ట్నర్ అరుణ్ కుమార్ తెలిపారు. సెమీకండక్టర్లు, AI/ML, రోబోటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి డీప్ టెక్ రంగాలు, సాస్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లాంటి ఎంటర్ ప్రైజింగ్ సాఫ్ట్ వేర్, గ్లోబల్ మార్కెట్లను అనుసంధానించే స్టార్టప్లలో పెట్టుబడులకు తాము ప్రాధాన్యతనిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
కల్తీ నెయ్యి కేసులో సిట్ కస్టడీకి టీటీడీ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, సుగంధి
Read Latest AP News And Telugu News