Madhavi Protocol Issue: ఎమ్మెల్యే మాధవి ప్రోటోకాల్ అంశం.. ప్రివిలేజ్ కమిటీ ఏం తేల్చిందంటే
ABN , Publish Date - Dec 08 , 2025 | 03:56 PM
కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి విషయంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంపై ప్రివిలేజ్ కమిటీ సమావేశమై చర్చించింది. అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్వోను కమిటీ ప్రశ్నించింది.
అమరావతి, డిసెంబర్ 8: అసెంబ్లీ కమిటీ హాల్లో ప్రివిలేజ్ కమిటీ ఈరోజు (సోమవారం) భేటీ అయ్యింది. ప్రివిలేజ్ కమిటీ ఛైర్మన్ పితాని సత్యనారాయణ ( Privilege Committee Chairman Pithani Satyanarayana) నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి (MLA Reddappagari Madhavi) విషయంలో ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యంపై కమిటీ విచారించింది. రిమ్స్లో క్యాథ్లాబ్ ప్రారంభోత్సవ శిలా ఫలకంలో ఎమ్మెల్యే పేరు లేకపోవడంపై చర్చ జరిగింది. ఈ వ్యవహారానికి సంబంధించి అప్పటి మెడికల్ సూపరింటెండెంట్, డీఆర్వోను కమిటీ ప్రశ్నించింది. గత వాయిదాకు ఇరువురు హాజరుకాకపోవటంపై తీవ్రంగా మందలించింది. ప్రభుత్వం మారిందనే స్పృహ లేకుండా పనిచేస్తున్నారా అని కమిటీ మండిపడింది.
తీరు మారకుండా ఎమ్మెల్యేల పట్ల అగౌరవంగా ఉంటున్నారని కమిటీకి మాధవీ రెడ్డి ఫిర్యాదు చేశారు. జరిగిన తప్పును అంగీకరించి కమిటీకి నాటి సూపరింటెండెంట్ క్షమాపణలు చెప్పారు. తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పొంతన లేని సమాధానాలు చెప్పిన నాటి డీఆర్వోపై కమిటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి విచారణకు రావాలని ఇరువురునీ ఆదేశించింది. అలాగే 2019-24 మధ్య ఎమ్మెల్యేగా తనకు జరిగిన ప్రోటోకాల్ ఉల్లంఘనలపై జోగేశ్వరరావు ఇచ్చిన ఐదు ఫిర్యాదులపైనా కమిటీ చర్చించింది. ఐదు ఫిర్యాదులపై నాటి అసెంబ్లీ సిబ్బంది నోటీసులు కూడా పంపకపోవటంపై కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గే ప్రోటోకాల్ పాటించలేకపోయామని అధికారులు వివరణ ఇచ్చారు. కమిటీని క్షమాపణలు కోరి, తప్పు పునరావృతం కాకుండా చూసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
కనువిందు చేసిన బ్రహ్మ కమలం పుష్పాలు
సొంత ఇలాకాలో జగన్కు గట్టి ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News