Airport Security Alert: ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్
ABN , Publish Date - May 10 , 2025 | 05:17 AM
భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ఎయిర్పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించి భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో భారీ బలగాలతో విస్తృత తనిఖీలు, షార్లోనూ భద్రత ముమ్మరం చేశారు

తిరుపతి, విశాఖ, విజయవాడ విమానాశ్రయాల్లో గట్టి నిఘా
తిరుమలలో భద్రత కట్టుదిట్టం.. విస్తృత తనిఖీలు
తిరుమల, విజయవాడ, విశాఖపట్నం, సూళ్లూరుపేట, మే 9(ఆంధ్రజ్యోతి): భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) హెచ్చరికల నేపథ్యంలో, కేంద్రం ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయాలైన విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అన్ని ఎయిర్పోర్టుల్లోనూ సీఐఎస్ఎఫ్, ఎస్పీఎఫ్, స్థానిక పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. శుక్రవారం ఉదయం నుంచే విజయవాడ విమానాశ్రయం మూడంచెల భద్రతా వలయంలోకి వచ్చింది. తిరుపతి ఎయిర్పోర్టు లోపల ఇప్పుడు రెండంచెలుగా ఉన్న భద్రత, తనిఖీలను నాలుగు అంచెలకు పెంచారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు. 130 మంది సివిల్, ఏఆర్, ఏపీఎస్పీ, విజిలెన్స్, బాంబ్, డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ బృందాలతో శుక్రవారం సాయంత్రం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ పరిసరాలు, మాడవీధులు, కాటేజీలు, లడ్డూకౌంటర్, అన్నప్రసాద భవనం, క్యూకాంప్లెక్స్లు, బస్టాండ్ వంటి రద్దీ ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. అలిపిరి నుంచి శ్రీవారి ఆలయం వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఘాట్రోడ్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇదిలా ఉంటే, తిరుమల క్షేత్రం మీదుగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్య దాదాపు 12 విమానాలు రాకపోకలు సాగించడం ఆందోళనకు దారితీసింది. అవి సాధారణ విమానాలేనని నిర్థారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం షార్లోనూ హై అలర్ట్ ప్రకటించారు. షార్ చుట్టు పక్కల ఉన్న అడవుల్లోనూ నిఘా పెంచారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందితో అంతరిక్ష కేంద్రంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New