AP Weather Alerts: రాష్ట్రంలో పెరిగిన ఎండ తీవ్రత
ABN , Publish Date - May 10 , 2025 | 04:47 AM
ప్రకాశం, తిరుపతి, నంద్యాల, శ్రీకాకుళం, చిత్తూరు తదితర జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. రాబోయే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉండగా, వడగాడ్పులు మరియు ఉక్కపోత ప్రభావం కొనసాగనుంది

నేడు పలు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం
కొన్ని జిల్లాలకు వర్ష సూచన
అమరావతి/విశాఖపట్నం, మే 9(ఆంధ్రజ్యోతి): వాయవ్య భారతం నుంచి పొడిగాలులు వీస్తుండడంతో కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత పెరిగింది. రాయలసీమ కంటే కోస్తాలో ఉక్కపోత ఎక్కువగా ఉంది. శుక్రవారం కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు, రాయలసీమలో రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా దరిమడుగులో 42, తిరుపతి జిల్లా గంగుడుపల్లెలో 41.3, నంద్యాల జిల్లా దొర్నిపాడులో 40.9, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 40.7, చిత్తూరు జిల్లా పిపల్లి, నెల్లూరు జిల్లా దగదర్తిలో 40.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ తీవ్రతతో వాతావరణ అనిశ్చితి నెలకొనడంతో పలుచోట్ల ఈదురుగాలులు, పిడుగులతో వర్షం కురిసింది.
రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు పడతాయని, మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగి ఉక్కపోత ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. శనివారం 42-43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, జిల్లాల్లోని 23 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. అలాగే అల్లూరి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలను సయితం విరాళాలు అడుక్కునే పరిస్థితిలో పాక్
పాక్ దాడులపై ఎక్స్లో భారత ఆర్మీ పోస్ట్
For More AP News and Telugu New