Employment in Power Sector: ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు ఖాళీ
ABN , Publish Date - May 05 , 2025 | 05:43 AM
2017 తర్వాత రాష్ట్ర ఇంధన సంస్థల్లో ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఖాళీల సమస్య పెరిగిపోతున్నట్లు సమాచారమొచ్చింది. యువత ఇటీవలి ఎన్నికల్లో నిరుద్యోగ సమస్యపై సీరియస్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
2017 తర్వాత ఇప్పటిదాకా భర్తీనే లేదు
అమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఇంధన సంస్థలలో ఉద్యోగులు తగ్గిపోతున్నారు. ఖాళీలు పెరిగిపోతున్నాయి. రిటైర్ అవుతున్న ఇంజనీర్లు, ఉద్యోగుల స్థానాలను ఆర్థిక నిర్వహణ పేరిట భర్తీ చేయడం లేదు. 2017లో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ జెన్కో, ట్రాన్స్కో, డిస్కమ్లలో ఇంజనీరింగ్ పోస్టుల్లో నియామకాలు చేపట్టారు. ఆ తర్వాత.. మళ్లీ లేదు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తానంటూ ప్రతిపక్షంలో ఉండగా జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఊరూరా హామీ ఇచ్చారు. కానీ ఆ ఐదేళ్లలో క్యాలెండర్లు మారిపోయాయే తప్ప ఒక్క ఏడాది కూడా ఉద్యోగ నియామక ప్రకటనలు రాలేదు. దీంతో.. 2023లో జరిగిన గ్రాడ్యుయేషన్ కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత వైసీపీకి గట్టి గుణపాఠాన్ని చెప్పింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పార్టీ 11 స్థానాలకే పరిమితమైంది. ఇక, తాజాగా కూటమి అధికారంలోకి వచ్చాక... నిరుద్యోగ యువత మరోసారి తమ డిమాండ్లను ముందుకు తెస్తోంది. ప్రధానంగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉద్యోగ నియమాకాల కోసం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు.