PV Sunil Kumar: ‘వైపీఎస్‌’ జల్సాలకు ఫైర్‌ సొమ్ము

ABN , First Publish Date - 2025-03-04T03:36:45+05:30 IST

నోరు తెరిస్తే అట్టడుగు వర్గాల పేదరికం గురించి మాట్లాడతారు.. మైకు పట్టుకుంటే అణగారిన వర్గాలపై వివక్షపైనే ప్రసంగిస్తారు..

PV Sunil Kumar: ‘వైపీఎస్‌’ జల్సాలకు ఫైర్‌ సొమ్ము

  • పెట్రోలు బంకుల కమీషన్‌ నిధులతోనే విదేశాలకు టికెట్ల కొనుగోలు!

  • ఖరీదైన సెంటు సీసాలు, లక్షల విలువైన సూట్‌కేసు కూడా..

  • 15 నెలల్లో రూ.10 లక్షలకు పైగా టీఏ బిల్లులు డ్రా చేసిన వైనం

  • సునీల్‌ లీలలు తవ్వేకొద్దీ కుప్పలుతెప్పలుగా బయటకు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

నోరు తెరిస్తే అట్టడుగు వర్గాల పేదరికం గురించి మాట్లాడతారు.. మైకు పట్టుకుంటే అణగారిన వర్గాలపై వివక్షపైనే ప్రసంగిస్తారు.. ఇవన్నీ మాటల్లో తప్ప చేతల్లో ఎక్కడా కనిపించవు. పేదరికం గురించి మాట్లాడే ఆయన వాడే సెంటు విదేశాల నుంచి వస్తుంది.. చేతికి పెట్టుకునే వాచ్‌, చేతిలో పట్టుకునే సూట్‌కేసు లక్షల ఖరీదు చేస్తాయి. సూటు, బూటులో ఆయన బ్రాండే వేరు. ఎక్కిదిగే విమానాలు, బస చేసే హోటళ్లు.. ఏవీ ఆయన చెప్పే నీతులకు దగ్గరగా ఉండవు. జగన్‌ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించి అఖిల భారత సర్వీసు నిబంధనలు ఉల్లంఘించి సస్పెండైన సీఐడీ, ఫైర్‌ విభాగాల మాజీ చీఫ్‌ పీవీ సునీల్‌కుమార్‌ లీలలు తవ్వేకొద్దీ బయటకు వస్తున్నాయి. తన వ్యక్తిగత విదేశీ ప్రయాణాలకు అగ్నిమాపక శాఖలోని సంక్షేమ నిధి నుంచి ఖర్చు చేశారని విశ్వసనీయంగా తెలిసింది. రాష్ట్రంలోని యూనిఫామ్‌ సర్వీసులు సంక్షేమ నిధుల కోసం పలు ప్రాంతాల్లో పెట్రోలు బంకులు ఏర్పాటు చేసుకున్నాయి. పోలీసు, జైళ్ల శాఖ తరహాలో అగ్నిమాపక శాఖ కూడా చీపురుపల్లి, కైకలూరు, మచిలీపట్నం, గుడివాడ, మార్కాపురం, నంద్యాల, పుత్తూరుల్లో బంకులు పెట్టింది. మొత్తం ఏడు బంకుల్లో విక్రయించే డీజీలు, పెట్రోలుపై ఆయా ఆయిల్‌ కంపెనీల నుంచి ప్రతి నెలా రూ.45 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ కమీషన్‌ వస్తుంది. బంకుల్లో పనిచేసే సిబ్బంది జీతాలు, ఇతరత్రా ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ము అగ్నిమాపకశాఖ సంక్షేమ ఖాతాలో జమవుతుంది.


ఈ డబ్బును ఫైర్‌ స్టేషన్లలో కనీస వసతులకు, సిబ్బంది సంక్షేమానికి ఖర్చు చేయాలని బైలా చెబుతోంది. అందుకు విరుద్ధంగా సునీల్‌ కుమార్‌ విదేశీ యానానికి విమాన టికెట్లను ఆ సొమ్ముతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం. సీఐడీ ఏడీజీ నుంచి 2022 జనవరిలో డీజీ పదోన్నతి పొందిన సునీల్‌ను కొన్ని రోజులు పక్కన బెట్టిన జగన్‌ ప్రభుత్వం.. 2023 మార్చిలో అగ్నిమాపకశాఖ డీజీగా నియమించింది. అప్పటి నుంచి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడే వరకూ కొనసాగిన ఈయన.. విదేశాలకు వెళ్లేందుకు అగ్నిమాపక శాఖ పెట్రోలు బంకుల నుంచి వచ్చిన కమీషన్‌తో టికెట్లు కొన్నారు. అంతటితో ఆగకుండా విదేశాల్లో కొనుగోలు చేసిన సెంటు సీసాలు, ఖరీదైన సూట్‌కేసు సైతం ఇవే డబ్బుతో కొనుగోలు చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఆయన నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థ సమావేశాలకు సైతం ఇవే నిధులు ఖర్చు చేశారని, సభల్లో పాల్గొనే వారి భోజనాలు, ఇతరత్రా ఖర్చులకు రూ.60 లక్షల వరకూ వ్యయం చేశారని సమాచారం. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చాక 2024 జూన్‌ 21న ఆయన్ను బదిలీచేసింది. ఎక్కడా పోస్టింగు ఇవ్వలేదు. అగ్నిమాపక శాఖలో ఉన్న 15 నెలల కాలంలో రూ.10 లక్షల వరకూ ఆయన టీఏ బిల్లులు పెట్టి డ్రా చేసుకున్నట్లు సమాచారం. వాస్తవాలు ఇలా ఉండగా.. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపునకు ఆయుధంగా సునీల్‌ను ఉపయోగించుకున్న జగన్‌కు చెందిన రోత పత్రిక మాత్రం.. దళిత అధికారిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు అంటూ రాయడం గమనార్హం. సునీల్‌కుమార్‌ డీజీ గా ఉన్నప్పుడు అగ్నిమాపక కార్యాలయంపైన ఆయ న స్వచ్ఛంద సంస్థ సమావేశాలు తరచూ జరిగేవి. వాటి సీసీ ఫుటేజీ తీస్తే గుట్టుమట్లు బయటపడే అవకాశం ఉందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Updated Date - 2025-03-04T03:36:49+05:30 IST