Election Commission: మార్చి 20న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు
ABN , Publish Date - Feb 25 , 2025 | 03:59 AM
రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది.
షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
వచ్చే నెల 29తో ముగియనున్న ఐదుగురు సభ్యుల పదవీ కాలం
తెలంగాణలో ఐదు స్థానాలకు కూడా..
అమరావతి/న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 29వ తేదీతో ఎమ్మెల్సీలు యనమల రామకృష్ణుడు, జంగా కృష్ణమూర్తి, దువ్వారపు రామారావు, పర్చూరి అశోక్బాబు, బి.తిరుమలనాయుడుల పదవీ కాలం ముగియనుంది. ఇందులో జంగా కృష్ణమూర్తిపై గతేడాది మే 15న మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన విషయం విదితమే. అప్పటి నుంచి ఆ ఎమ్మెల్సీ స్థానం ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలో ఈసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆయా స్థానాలకు ఎన్నికల నిర్వహణ కోసం మార్చి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 10న నామినేషన్ల స్వీకరణకు తుది గడువు, 11న నామినేషన్ల పరిశీలన, 13వ తేదీని నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీగా ఈసీ పేర్కొంది. మార్చి 20వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నట్లు తెలిపింది. మార్చి 24వ తేదీతో ఈ ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. కాగా, ఇదే షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో కూడా ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలోని మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, శేరి సుభాష్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, మీర్జా రియాజుల్ హాసన్ల పదవీకాలం సైతం మార్చి 29తోనే ముగియనుంది. ఇందులో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన మల్లేశం కాంగ్రె్సలో చేరారు. రియాజుల్ హాసన్ ఎంఐఎం ఎమ్మెల్సీ కాగా, మిగిలిన ముగ్గురు బీఆర్ఎస్ సభ్యులు.