Acharya NG Ranga University : రంగా వర్సిటీకి అవినీతి రంగు!
ABN , Publish Date - Jan 24 , 2025 | 04:26 AM
ఒకప్పుడు హరిత విప్లవానికి బాటలు వేసిన గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అవినీతి రంగు పులుముకుంది.
గత ఏడాది ఎన్నికలకు ముందు దోచేశారు
సీనియర్ ప్రొఫెసర్ పదోన్నతుల్లో భారీ అక్రమాలు
బదిలీల రద్దు, రీ-పోస్టింగ్ కోసం రూ.కోటి వసూలు
అవుట్ సోర్సింగ్ నియామకంలో మామూళ్ల రాజ్యం
ఆర్థిక కమిటీ అనుమతి లేకున్నా 9.50 కోట్లు బదిలీ
15 కోట్ల భవన నిర్మాణ నిధులలో ముడుపులు
విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదుల వెల్లువ
గుంటూరు సిటీ, జనవరి 23(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు హరిత విప్లవానికి బాటలు వేసిన గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి అవినీతి రంగు పులుముకుంది. గత ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు.. పదోన్నతులు, బదిలీలు, కొత్త ఉద్యోగుల నియామకాల్లో నియమ నిబంధనలను బుట్టదాఖలు చేసి రూ.కోట్లు దండుకున్నట్టు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నంద్యాలకు చెందిన ఎన్. వెంకటేశ్వరరెడ్డి, జి. వెంకటేశ్వరరావు సహా పలువురు విజిలెన్స్ డీజీ, గుంటూరు ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయంలో జరిగిన అవినీతి, అక్రమాలను పూసగుచ్చినట్టు వివరించారు. ఖాళీల సంఖ్యతో పని లేకుండానే 30 మందికి సీనియర్ ప్రొఫెసర్(హయ్యర్ అకడమిక్ గ్రేడ్ పే) పదోన్నతులు ఇవ్వడం ద్వారా వర్సిటీలోని కీలకమైన వ్యక్తి భారీగా ముడుపులు పుచ్చుకున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదులోని కీలక అంశాలు..
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వర్సిటీ పరిధిలో 300మందిని బదిలీచేశారు. వారిలో కొందరి బదిలీలు రద్దు చేసేందుకు, వేరే చోటపోస్టింగ్ ఇచ్చేందుకు రూ.కోటి వరకు నగదు చేతులు మారింది.
తిరుపతి వ్యవసాయ కళాశాలకు కేవలం 5 సూపరింటెండెంట్ పోస్టులు మాత్రమే మంజూరు కాగా, అక్కడ 14 మందిని నియమించి రూ.50 లక్షల వరకు బహిరంగంగా వసూలు చేశారు.
వర్సిటీ ప్రాంగణంలో కొత్తగా నిర్మితమైన ‘ఐఏ’-బీ భవనం ప్రారంభోత్సవం తర్వాత విశ్వవిద్యాలయం నిధుల నుంచి రూ.15 కోట్ల వరకు డ్రా చేసి, దానిలో 15 శాతం నిధులు ముడుపుల కింద(సుమారు రూ.2.25 కోట్లు) తీసుకున్నారు. దీనికిగాను వర్సిటీకి చెందిన కీలకమైన వ్యక్తి తన చెప్పు చేతల్లో ఉండే మరో వ్యక్తిని తగిన అర్హత లేనప్పటికీ ఎస్టేట్ అధికారిగా నియమించారు.
వర్సిటీకి చెందిన రూ.9.50 కోట్ల నిధులు లాం ఫామ్లోని కెనరాబ్యాంకు నుంచి యూనియన్ బ్యాంకుకు మార్చారు. విశ్వవిద్యాలయ ఆర్థిక కమిటీ అనుమతి లేకుండానే ఇది జరిగిపోయింది.
రూ.6.5 కోట్లు వర్సిటీ కంప్ర్టోలర్కి అప్పగించకుండా చాలా కాలంగా ఎస్టేట్ అధికారి ఖాతాలో ఉంచారు. ఇది నిబంధనలకు విరుద్ధం.
ఇటీవల 140 వ్యవసాయ ‘బీ’ ఎస్సీ సీట్లు కూడా అక్రమంగా కేటాయించారు. ఈ క్రమంలో భారీగా నగదు వసూలు చేశారు.
మహానంది వ్యవసాయ కళాశాలతో పాటు మరో ఆరు ప్రాంతాల్లో పరీక్ష పేపర్లు లీకైన వ్యవహారంలో వర్సిటీ ఉన్నతాధికారులు ఇచ్చిన విచారణ నివేదికను తుంగలో తొక్కి నిందితుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము పుచ్చుకుని వారిని కాపాడే ప్రయత్నం చేశారు.
అన్యమత ప్రచారం..
ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని విజిలెన్స్కు ఇచ్చిన ఫిర్యాదులో ఎన్. వెంకటేశ్వరరెడ్డి, జి. వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వర్సిటీ కీలకమైన వ్యక్తులు కూడా వీటిలో పాల్గొంటున్నారని తెలిపారు. మధ్యాహ్నం సమయాల్లో వర్సిటీ పరిపాలనా కార్యాలయంలో ప్రార్థనలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆ మతానికి చెందిన వారికి మాత్రమే అక్కడ ప్రాధాన్యత కలిగిన పోస్టులు, స్థానం ఇస్తున్నట్లు వివరించారు. గవర్నర్ అనుమతి లేకుండానే కీలకమైన అధికారి పర్యటనలు చేయటం యూనివర్సిటీ నిబంధనలకు విరుద్ధమని, దీనికి సంబంధించి రూ.లక్షలు వెచ్చించటం కూడా నేరమేనని ఫిర్యాదు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Fog Effect: గన్నవరం ఎయిర్పోర్టుకు రావలసిన పలు విమానాలు ఆలస్యం
Lokesh Visit Davos: అంతర్జాతీయ ఎయిర్పోర్టు ఏర్పాటు చేయండి: మంత్రి లోకేష్
Read Latest AP News And Telugu News