Weddings : నూతన వధూవరులకు చంద్రబాబు ఆశీస్సులు
ABN , Publish Date - Feb 24 , 2025 | 04:54 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు.

నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో వివాహ వేడుకలకు హాజరైన సీఎం
నెల్లూరు, తిరుపతి, ఫిబ్రవరి 23(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో జరిగిన రెండు వివాహ వేడుకలకు హాజరయ్యారు. నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర కుమారుడు బీద గోకుల రిష్వంత్-దివిజ వివాహానికి సీఎం హాజరై నూతన వధూవరులకు పుష్పగుచ్ఛం అందజేసి ఆశీర్వదించారు. మధ్యాహ్నం 1.15 గంటలకు నెల్లూరుకు విచ్చేసిన చంద్రబాబుకు హెలిప్యాడ్ వద్ద మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, వక్ఫ్బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్, టీడీపీ నేతలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రోడ్డుమార్గాన వివాహ వేదిక వద్దకు చేరుకోగా, అక్కడ ఎంపీ బీద మస్తాన్రావు, వారి కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. అనంతరం, మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం తిరుగుపయనమయ్యారు. అంతకుముందు చంద్రబాబు తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం సమీపంలో తిరుపతి పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు, ఏపీ యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ తనయుడు సుదర్శన్ యాదవ్ వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులు సుదర్శన్ యాదవ్, పూజను ఆశీర్వదించారు.