Yoga: నేడు యోగా కార్యక్రమాలు
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:35 AM
యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.
చిత్తూరు కలెక్టరేట్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లావ్యాప్తంగా 5508 ప్రాంతాల్లో 8.10 లక్షల మంది ప్రజలు యోగాంధ్ర కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేశామని కలెక్టర్ సుమిత్కుమార్ తెలిపారు.గతనెల 21వ తేది నుంచి శుక్రవారం వరకు నెలరోజుల పాటు యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా జిల్లా అంతటా రోజువారీ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.శనివారం 5508 ప్రాంతాల్లో ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య యోగా కార్యక్రమాలు పెద్దఎత్తున నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆయన అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించి దిశానిర్దేశం చేశారు. అన్నిచోట్ల పబ్లిక్ అడ్రస్ సిస్టం, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ వ్యవస్థలను ఏర్పాటుచేయాలన్నారు. చిత్తూరు మెసానికల్ గ్రౌండ్లో ఉదయం 6.30 నుంచి 8.00 గంటల వరకు జరిగే యోగా కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పురప్రముఖులు, సీనియర్ సిటిజన్లు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ విద్యార్థులందరూ పాల్గొనేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శుక్రవారం రాత్రి మెసానికల్ గ్రౌండ్లో జిల్లా యంత్రాంగం యోగా కార్యక్రమ ఏర్పాట్లను చేపట్టింది.అయితే మధ్యలో వర్షం రావడంతో కొంత అంతరాయం ఏర్పడింది.
పుంగనూరు, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): తన చుట్టూ వున్నవారిని మానసిక ఒత్తిళ్లు, ప్రబలుతున్న వ్యాధులు, కాలుష్య ప్రభావం నుంచి బయటపడేసి ఆరోగ్యవంతులుగా ఉం చాలన్న ఆశయంతో 22ఏళ్లుగా యోగాలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు పుంగనూరుకు చెందిన వనిత. బెంగళూరులోని శ్రీ వివేకా నంద యోగా అనుసంధాన సంస్థలో ప్రత్యేక శిక్షణ పొందిన ఆమె ఆరోగ్య సమస్యల నుంచి బయట పడటంతో తనకు ఉపయోగపడ్డ యోగాను మరింత విస్తృతం చేయాలని భావించారు.ఇప్పటివరకూ సుమారు 1500 మందికి యోగాలో శిక్షణ ఇచ్చారు.మహిళలకు ప్రత్యేకంగా యోగా శిక్షణ ఇవ్వడంతో అనేక మంది యోగా గురువులుగా తయారై పలువురికి శిక్షణ ఇస్తున్నారు. 1979లో పుంగనూరు బ్రాంచి పోస్టుమాస్టర్గా ఉద్యోగంలో చేరిన వనిత 2007లో భర్త రాజేంద్రకుమార్ గుండెపోటు కారణంగా చనిపోవడంతో డిప్రెషన్కు లోనయ్యారు. ఆ సమయంలో యోగా గురించి తె లుసుకుని ఎస్ఎ్సవైలో యోగాపై శిక్షణ పొందారు.అనంతరం బెంగళూరులో శిక్షణ పొంది సర్టిఫికెట్ తీసుకున్నారు. రోజూ అర్ధగంట యోగా చేస్తే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చంటారు ఆమె.
నిత్య యోగా..... నా ఆరోగ్య రహస్యం
చిత్తూరు కల్చరల్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఆయన వయసు 83, రెండు మోకాళ్ల చిప్పలు అరిగి పోయాయి. అయినా నో ట్రీట్మెంట్. నో బీపీ, నో డయాబెటెక్, నో కార్డియాలజీ కంప్లెంట్, వీటన్నిటికి 60యేళ్లుగా చేస్తున్న యోగా, వ్యాయమాలే కారణమంటున్నారు కె.వెంకట్రమణ. చిత్తూరు కలెక్టరేట్లో ఏవోగా పని చేసి రిటైరైన ఆయన రోజూ రాత్రి తొమ్మిది గంటలకల్లా పడుకుంటారు. వేకువజామున నాలుగు గంటలకు నిద్రలేచి వ్యాయామంతో పాటు యోగాసనాలు వేస్తారు. తాను చేస్తున్న యోగాలో పట్టా పుచ్చుకోవాలనే తలంపుతో రిటైరయ్యాక 2003వ సంవత్సరంలో హైదరాబాద్లో స్టేట్ యోగా ఫెడరేషన్ ద్వారా శిక్షణ పొంది యోగాలో డిప్లొమా సర్టిఫికెట్ పొందారు. అప్పటినుంచి తన నివాసాన్నే యోగాభ్యాస కేంద్రంగా మార్చి వందలాదిమంది స్త్రీ పురుషులకు, యువతకు, చిన్నారులకు యోగా బోధిస్తున్నారు.
తిరుపతిలో ‘యోగాంధ్ర’కు సర్వం సిద్ధం
తిరుపతి (విశ్వవిద్యాలయాలు), జూన్ 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగరంలోని ఎస్వీయూ తారకరామ స్టేడియం జిల్లాస్థాయి యోగాంధ్ర-2025కు సిద్ధమైంది. శనివారం ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు.. ఏక కాలంలో పది వేల మందితో యోగా చేసేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5 గంటల నుంచి స్టేడియంలోపలకు అనుమతిస్తారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆయా విద్యాసంస్థల అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులకు ఉత్తర్వులు జారీ చేశారు. యోగాలో పాల్గొనే వారందరికీ ఉచితంగా టీ షర్టులు అందజేస్తున్నారు. తాగునీటి సదుపాయం కల్పించనున్నారు. యోగా పూర్తయిన వెంటనే స్నాక్స్ అందించనున్నారు. యోగా చేసే సమయంలో ఎవరికైనా ఇబ్బంది ఏర్పడితే తక్షణ వైద్య సహాయం అందించేందుకు ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. సంచార మరుగుదొడ్లు సిద్ధం చేశారు. కార్యక్రమ ప్రాంగణానికి అందరినీ తరలించేందుకు రవాణా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమాన్నంతా డ్రోన్లతో చిత్రీకరించనున్నారు. ఫొటో, వీడియోగ్రఫీకి వీలుగా ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. తారకరామా స్టేడియం పరిశుభ్రం చేసి ప్రాంగణమంతా గ్రీన్ కార్పెట్ పరిచారు. ఈ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు జిల్లా.. యూనివర్సిటీ అధికారులు పర్యవేక్షించారు. కలెక్టర్ వేంకటేశ్వర్ ఏర్పాట్లను పరిశీలించి.. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు.
జిల్లాలో 6,200 ప్రాంతాల్లో యోగాంధ్ర
తిరుపతి(కలెక్టరేట్), జూన్ 20(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 6,200 ప్రాంతాల్లో శనివారం ఉదయం యోగాంధ్ర నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముందస్తు ఏర్పాట్లపై శుక్రవారం ఆయన కలెక్టరేట్లో జేసీ శుభం బన్సల్తో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లా స్థాయిలో తిరుపతిలోని తారకరామ స్టేడియంలో జరిగే యోగా కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను కమిషనర్ మౌర్య, పర్యాటకశాఖ అధికారి రమణ ప్రసాద్ కలెక్టర్కు వివరించారు.