Davos Summit : మళ్లీ ‘ఏపీ’ బ్రాండ్
ABN , Publish Date - Jan 24 , 2025 | 02:43 AM
బ్రాండ్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన ప్రారంభించింది. టీమ్ ఇండియా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తన యాత్రను ముగించింది.
దావోస్ సదస్సులో బయటపడ్డ మన ‘ఎనర్జీ’
ఐటీ నుంచి ఏఐ వరకు.. డేటా సెంటర్ల నుంచి గ్రీన్ ఎనర్జీ, హైడ్రోజన్ హబ్ వరకు..
ఏపీలోని విస్తృతమైన అవకాశాలపై ప్రచారం
ఉపాధి కేంద్రంగా పెట్టుబడులకు ఆహ్వానం
ఏపీలో సుదీర్ఘ తీరం.. అపార నైపుణ్య యువత
దిగ్గజ కంపెనీలనూ మెప్పించిన సానుకూలతలు
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వరుస భేటీలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
బ్రాండ్ ఏపీ నినాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటన ప్రారంభించింది. టీమ్ ఇండియా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ తన యాత్రను ముగించింది. బిల్గేట్స్ నుంచి టాటా గ్రూపు చంద్రశేఖరన్ వరకు.. ఐటీ నుంచి ఏఐ వరకు.. వేగంగాను, విస్తృతంగాను పెట్టుబడుల వేట సాగింది. గడచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో దావోస్ సదస్సులో ఏపీ దాదాపు ఉనికి కోల్పోయింది. రాష్ట్రం నుంచి సరిగా ప్రాతినిథ్యమే లేదు. రాష్ట్రం నుంచి కంపెనీలను వెళ్లగొట్టడమే పనిగా నాడు జగన్ ప్రభుత్వం అనుసరించిన విధానాలు కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలను మృగ్యంచేశాయి. దీంతో 2022లో ఒకసారి నాటి సీఎం జగన్ దావోస్ సదస్సుకు వెళ్లినా, ప్రతిస్పందన శూన్యం. కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన తొలి దావోస్ సదస్సులో మళ్లీ ఏపీ బ్రాండ్ మెరిసింది. రాష్ట్రానికి పెట్టుబడులను, కంపెనీలను ఆకర్షించే లక్ష్యంతో 20న స్విట్జర్లాండ్లోని జ్యూరిక్ ఎయిర్పోర్టులో చంద్రబాబు, మంత్రులు లోకేశ్, భరత్ అడుగుపెట్టారు. వారికి ప్రవాసులు స్వాగతం పలకగా, వారిని ఉద్దేశించి వారు మాట్లాడారు. ఈ సమయంలో చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఎయిర్పోర్టును నిర్మించిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు సహా పలువురు పారిశ్రామికవేత్తలు హోటల్లో చంద్రబాబును కలిసి చర్చించారు.
అదే రాత్రి దావోస్కు చంద్రబాబు, మంత్రులు చేరుకున్నారు. దావోస్ పెవిలియన్లలో వరస సమావేశాలతో చంద్రబాబు.. లోకేశ్ ఆ మూడురోజులూ గడిపారు. గ్రీన్, క్లీన్ ఎనర్జీకి ఏపీ గమ్యస్థానంగా మారిన తీరును దిగ్గజ కంపెనీలకు చెప్పి, సానుకూల స్పందనను రాబట్టారు. హైడ్రోజన్ హబ్... డేటా సెంటర్లు...గూగుల్ క్లౌడ్ విస్తరణ.. వర్క్ఫ్రమ్ హోమ్కు పరిశ్రమ హోదా.. ఇలా రాష్ట్రం తొక్కుతున్న కొత్త పుంతలను దావోస్ వేదికపై పరిచయం చేశారు. స్విస్మెన్, ఓర్లికాన్, ఆంగ్స్ ఫిస్టర్, స్విస్ టెక్స్టైల్స్ యాజమాన్యాలతో చంద్రబాబు బృందం వరుస సమావేశాలు నిర్వహించింది. రాష్ట్రంలో రీసెర్చిసెంటర్ ఏర్పాటుకు స్విస్మెన్ సంస్థ ముందుకొచ్చింది. ఇన్నోవేషన్ హబ్లు, ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. అడ్వాన్స్డ్ కోటింగ్ సొల్యూషన్ సెంటర్న ఏర్పాటుకు ఓర్లికాన్ మొగ్గుచూపింది. ఏఐ సెంటర్ల ఏర్పాటుపైనా ఈ సంస్థ ఆసక్తిని చూపింది.
ఆరోగ్యం, విద్యలో కొత్త ఆవిష్కరణలు
అడ్వాన్స్డ్ సీలింగ్ సొల్యూషన్ ప్లాంట్ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆంగ్స్ ఫిస్టర్ సంస్థను చంద్రబాబు కోరారు. దీనిపై ఆ సంస్థ సానుకూలత వ్యక్తం చేసింది. రిసెర్చి టెక్స్టైల్ యూనిట్ ఏర్పాటుకు స్విస్ టెక్స్టైల్స్ కంపెనీ ముందుకొచ్చింది. ప్రపంచంలోనే అదిపెద్ద సముద్రయాన రంగ సంస్థ మార్క్స్ సంస్థ.. ఏపీలోని సముద్రతీరం పట్ల ఆసక్తి చూపింది. త్వరలోనే పర్యటనకు వస్తామని ఆ సంస్థ యాజమాన్యం హామీ ఇచ్చింది. విశాఖ, తిరుపతిలో కార్యకలాపాలను ప్రారంభించాలన్న చంద్రబాబు ఆహ్వానానికి ‘సిస్కో’ సానుకూలంగా స్పందించింది. తిరుపతి, విశాఖలో సెమికండక్టర్ యూనిట్లను స్థాపించే విషయమై త్వరలో నిర్ణయం తెలుపుతామని దక్షిణ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్ సంస్థ సీఈవో పిన్హక్ చియోబ్ తెలిపారు. కార్ల్స్బెర్గ్ గ్రూప్ రాష్ట్రంలో పండ్ల రసాలు, శీతల పానీయాలు, బీర్లు, ప్యాకేజి డ్రింకింగ్ వాటర్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు సానుకూలత ప్రదర్శించింది. చంద్రబాబుతో గూగుల్ క్లౌడ్ సీఈవో ఽథామస్ కురియన్ సమావేశమయ్యారు. విశాఖలో.. అమరావతిలో గూగుల్ డిజైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చంద్రబాబు కోరగా, కురియన్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రాన్ని పెట్రోలియం హబ్గా మార్చే దిశలో భాగస్వాములమవుతామని పెట్రోనాన్ పేర్కొంది. రాష్ట్రంలో పెప్సికో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చైౖర్మన్ స్టీవెన్ కెహో సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆరోగ్య, విద్యారంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ఏపీని కేంద్రంగా మార్చే అంశాన్ని మిలిందా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను కలిసి చంద్రబాబు చర్చించారు. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ డయాగ్నోస్టిక్స్ను నెలకొల్పేందుకూ, ఏఐ వర్సిటీ ఏర్పాటు చేసేందుకు బిల్గేట్స్ సమ్మతి తెలిపారు. హిందుస్థాన్ యూనీలీవర్, టాటా సన్స్ గ్రూప్ చంద్రశేఖరన్లతో చంద్రబాబు సమావేశాలు సానుకూలంగా ముగిశాయి.