Share News

కరువును తరిమి కొడతా

ABN , Publish Date - Sep 11 , 2025 | 12:23 AM

జిల్లా నుంచి కరువును తరిమి కొడతానని, ఇది సీబీఎన మాట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా ప్రజలకు అధికారికంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బ్లూ ప్రింట్‌ తయారు చేశానని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. రాయలసీమను ఎనర్జీ సిటీ చేస్తానని ప్రకటించారు. కియ పరిశ్రమతో అనంతకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చానని అన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయని పనిని వంద రోజుల్లో పూర్తి చేశామని

 కరువును తరిమి కొడతా

అనంత అభివృద్ధికి నాదీ హామీ

బ్లూ ప్రింట్‌ తయారు చేశా

డిఫెన్స, సోలార్‌, డ్రోన, గ్రీన ఎనర్జీ హబ్‌గా మారుస్తా

ఇరిగేషన ప్రాజెక్టులపై శ్రద్ధ పెడతా

సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ బహిరంగ సభలో సీఎం చంద్రబాబునాయుడు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లా నుంచి కరువును తరిమి కొడతానని, ఇది సీబీఎన మాట అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జిల్లా ప్రజలకు అధికారికంగా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి బ్లూ ప్రింట్‌ తయారు చేశానని తెలిపారు. అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని భరోసా ఇచ్చారు. రాయలసీమను ఎనర్జీ సిటీ చేస్తానని ప్రకటించారు. కియ పరిశ్రమతో అనంతకు బ్రాండ్‌ ఇమేజ్‌ తీసుకొచ్చానని అన్నారు. ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేయని పనిని వంద రోజుల్లో పూర్తి చేశామని అన్నారు. రూ.3,850 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి కాలువను విస్తరించి, కృష్ణా జలాలను కుప్పం వరకూ తీసుకెళ్లామని అన్నారు. అనంతపురం జిల్లాలో సాగునీటి ప్రాజక్టులను పూర్తి చేయడంపై శ్రద్ధ పెడుతామని భరోసా ఇచ్చారు.


అనంతపురం నగరంలో బుధవారం నిర్వహించిన సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్‌ బహిరంగ సభకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. లక్షలాదిమంది ప్రజలను ఉద్దేశించి ఆయన సుమారు 50 నిమిషాలు సుదీర్ఘంగా ప్రసంగించారు. రాయలసీమ రాత మార్చడానికి తాగునీటి ప్రాజెక్టులు ప్రారంభించిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు అన్నారు. హంద్రీనీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులు టీడీపీ హయాంలో చేపట్టామన్నారు. సీమ పల్లెల్లో ఫ్యాక్షన అంతం చేసి, నీళ్లు ఇచ్చిన ఘనత టీడీపీదేనన్నారు. ఈ ఏడాది రాయలసీమలో వర్షాలు పడకున్నా.... అన్ని చెరువులను నింపామని తెలిపారు. ఎన్నికల ముందు... రాయలసీమ సీమ మారుతోందని చెప్పాననీ, అప్పట్లో ఎవరూ నమ్మలేదన్నారు. చరిత్రలో మొదటిసారి సీమలో 52 సీట్లకు 42 సీట్లు కూటమి గెలిచిందన్నారు. భవిష్యత్తులో అన్ని సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లా ఎడారిగా మారే పరిస్థితి ఉండేదన్నారు. డ్రిప్‌ సిస్టమ్‌ను తీసుకొచ్చి, ప్రాజెక్టులు చేపట్టి ఎడారి ప్రాంతానికి జీవం పోశానని తెలిపారు. జిల్లాకు కియ పరిశ్రమను తీసుకొచ్చి, అనంతను దేశంలో బ్రాండ్‌గా ప్రమోట్‌ చేశామని పేర్కొన్నారు. పత్తికొండ, జీడిపల్లి, పెన్నహోబిళం, గొల్లపల్లి, చెర్లోపల్లి, అడవిపల్లి, గాజులదిన్నె తదితర ప్రాజక్టులు నీటితో నింపామన్నారు. గండికోట, బ్రహ్మసాగర్‌, సోమలేరు ప్రాజెక్టులకు సైతం నీళ్లు ఇచ్చామన్నారు. ముందుచూపుతో రాష్ట్రంలో రిజర్వాయర్లను 90 శాతం నింపామని తెలిపారు. రాషా్ట్రనికి జలకళ తీసుకొచ్చామనీ, దానిని శాశ్వితం చేస్తానని సీఎం ఉద్ఘాటించారు. సీమలో తిరుపతి, శ్రీశైలం గొప్ప ఆలయాలు ఉన్నాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక ఆలయాలని అభిప్రాయపడ్డారు. నీరు ఇస్తే రాయలసీమ రైతులు రతనాలు పండిస్తారనీ, అందుకే అన్ని ప్రాజెక్టులను నింపామన్నారు. కరువు శాశ్వత నివారణకు కృషి చేస్తాననీ, ఇదే సీబీఎన మాట అంటూ భరోసా ఇచ్చారు.

సీమకు కొత్త ఎనర్జీ ఇస్తా...

రాయలసీమకు డిఫెన్స, స్పేస్‌ సిటీ, ఏరోస్పేస్‌, సెమీ కండక్టర్‌, ఎలకి్ట్రసిటీ, ఆటో మొబైల్స్‌ పరిశ్రమలు వస్తాయన్నారు. డ్రోన సిటీ, గ్రీన ఎనర్జీ, సోలార్‌, విండ్‌, పంప్డ్‌ స్టోరేజ్‌ ఎనర్జీ పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. సీమను ఎనన్జీ హబ్‌గా మారుస్తామన్నారు. ఎవరు అడ్డొచ్చినా సీమ అభివృద్ధి ఆగదన్నారు. రోడ్లు, ఎయిర్‌పోర్టులు, స్టీల్‌ ప్లాంట్లను అభివృద్ధి చేయడంతోపాటు హార్టికల్చర్‌ హబ్‌గా మార్చే బాధ్యత తమదన్నారు. తనకు, ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్‌కు రాషా్ట్రభివృద్ధి ధ్యాస తప్ప.. మరొకటి లేదన్నారు. రాషా్ట్రనికి మంచి చేయాలనే తమ సంకల్పానికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి కృతజ్ఞతలు అన్నారు. కేంద్రం దసరాకు కానుకగా పన్నులు తగ్గిస్తోందన్నారు. వస్తువుల ధరలు తగ్గించి మనకు అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. ఈ విషయంలో తాను ప్రధాని మోదీని అభినందిస్తున్నానని తెలిపారు.

జగనకు సవాల్‌..

వైసీపీ నాయకులు అసెంబ్లీకి రాకుండా ఫేక్‌ ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఫేక్‌ ప్రచార ఆఫీసులు పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఒకాయన ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరుతున్నారనీ, అది తాను ఇచ్చేది కాదన్నారు. ప్రజలు ఇచ్చేదన్నారు. సీఎం పదవి కూడా తనకు ప్రజలే ఇచ్చారన్నారు. ఇలాంటివారు రాజకీయాలకు అర్హులా అంటూ ప్రశ్నించారు. జగనకు ప్రజలంతా క్లాస్‌ తీసుకోవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా అడక్కుండా ఆయన అసెంబ్లీకి రావాలని సూచించారు. శాసనసభకు రాకుండా రప్పా.. రప్పా.. అంటూ రంకెలేస్తున్నారన్నారు. ఆయన రంకెలేస్తే... చూస్తూ ఊరుకోడానికి ఇక్కడున్నది ఎవరో కాదనీ, సీబీఎన, పవన కల్యాణ్‌ అంటూ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి ఆడబిడ్డలను అవమానిస్తే... 5 నిమిషాల్లో అలాంటి వాళ్ల చొక్కా పట్టుకునేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. పులివెందుల,ఒంటిమిట్ట ఎన్నికల్లో ఏం జరిగిందో జగనకు తెలుసన్నారు. రప్పా.. రప్పా.. అనడంతో ప్రజలు బెండు తీశారనీ, ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ హెచ్చరించారు. వైసీపీది ధ్రుతరాష్ట్ర కౌగిలి అనీ, ఎవరైనా ఏమారితే... దానికి బలైపోతారని సూచించారు.

అహంకారం, అవినీతి వద్దు...

మూడు పార్టీల నాయకులు కాలర్‌ ఎగరేసి తిరగేలా పనిచేస్తున్నామన్నారు. మూడు పార్టీలకు న్యాయం చేయడం తమ ధ్యేయం అన్నారు. అహంకారం, అవినీతి వద్దన్నారు. జెండాలు మోసిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. మూడు పార్టీల నాయకులు సైతం ఐకమత్యంగా పనిచేయాలన్నారు. చివరి శాస్వ వరకూ పేదల అభివృద్ధి కోసమే చిందిస్తామన్నారు. రాముడు తరహా పాలన ఇచ్చే బాధ్యత తనది, పవన కల్యాణ్‌, బీజేపీది అని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - Sep 11 , 2025 | 12:23 AM