Operation Sindoor: భారత్ టెర్రరిజానికి వ్యతిరేకం
ABN , Publish Date - May 09 , 2025 | 04:17 PM
CM Chandrababu On Terrorism: టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. భారత్ మీద దాడులు చేస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

అనంతపురం, మే 9: భారతదేశం టెర్రరిజానికి వ్యతిరేకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. ఈరోజు(శుక్రవారం) ఛాయాపురం ప్రజావేదికలో సీఎం మాట్లాడుతూ.. కాశ్మీర్లో అతికిరాతకంగా ఆడబిడ్డల ఎదురుగా మగవాళ్లను ఇష్టానుసారం చంపేశారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సిందూర్ (Operation Sindoor) అనే కార్యక్రమం పెట్టిందని.. టెర్రరిస్టులపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపిందని అన్నారు. భారత్ మీద దాడులు చేస్తూ పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. దేశభక్తితో వీర జవాన్ మురళీ నాయక్ అనంతపురం జిల్లా వాసి ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆ కుటుంబానికి అని విధాలా అండగా ఉంటామని..ఆ కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు. దేశం కోసం మురళీనాయక్ వీర మరణం పొందారని.. అతడి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు.
బార్డర్లో ఉండి నిద్రాహారాలు మాని జవాన్లు దేశ రక్షణ చేస్తుండటం వల్లే ఇక్కడ మనం హాయిగా నిద్ర పోతున్నామన్నారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడటం మంచిది కాదన్నారు. దేశం చేసే పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలన్నారు. భారత్ మాతాకు జై అంటూ చంద్రబాబు నినాదాలు చేశారు. అలాగే వీరమరణం పొందిన మురళీనాయక్ ఆత్మకు శాంతి కలగాలని సీఎం చంద్రబాబు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Operation Sindoor: మీ ఆవేదన తీర్చలేనిది.. మురళీనాయక్ ఫ్యామిలీకి సీఎం పరామర్శ..
కాగా.. భారత్ - పాక్ యుద్ధ భూమిలో శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన జవాన్ మురళీనాయక్ వీరమరణం పొందారు. మురళీ నాయక్ మృతిపట్ల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా రాజకీయ నేతలు నివాళులర్పించారు. మృతుడు మురళీ నాయక్ కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు సీఎం. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేపు(శనివారం) మురళీ నాయక్ మృతదేహం స్వస్థలానికి చేరుకోనున్నారు.
సీఎం పర్యటన..
అనంతపురం జిల్లా జిల్లాలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. ఉరవకొండ నియోజకవర్గం చాయాపురంలో హంద్రీనీవా సుజల స్రవంతి పనులను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. హంద్రీనీవా పనులపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. కి.మీ మేర సాగుతున్న పనులను డ్రోన్ ద్వారా పరిశీలించారు. ప్రోగ్రామింగ్ ద్వారా రోజూ ఎంతమేర పనులు చేశారో డ్రోన్ ద్వారా పర్యవేక్షించాలని సూచించారు. నాలుగు ఏజన్సీల ద్వారా పనులు జరుగుతున్నాయని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఇటీవల నాలుగుసార్లు వర్షాలు కురవడంతో పనులకు కొంతమేర ఆటంకం ఏర్పడిందని తెలుపగా... ఇకపై వేగంగా పనులు సాగించాలని సీఎం సూచించారు. నిర్దేశిత కాలానికి ఎట్టిపరిస్థితుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.