Development : అమరావతి అభివృద్ధిలో ఏడీసీ జోరు
ABN , First Publish Date - 2025-01-10T05:28:15+05:30 IST
రాజధాని పనుల్లో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) జోరు పెంచింది. వరుసగా టెండర్లు పిలుస్తున్న సీఆర్డీఏ బాటలో ఏడీసీ కొనసాగుతోంది.
2791 కోట్ల అంచనాలతో టెండర్లకు పిలుపు
ఇప్పటికే 852.57 కోట్ల పనులకు టెండర్లు
ఇప్పటి వరకు మొత్తం విలువ 3643.88 కోట్లు
వాగులు, రిజర్వాయర్లు, ట్రంక్ ఇన్ర్ఫా పనులు
విజయవాడ, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని పనుల్లో అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) జోరు పెంచింది. వరుసగా టెండర్లు పిలుస్తున్న సీఆర్డీఏ బాటలో ఏడీసీ కొనసాగుతోంది. తాజాగా రూ. 2,791.31 కోట్ల అంచనాలతో 8 టెండర్లు పిలిచింది. ఇప్పటికే రూ. 852.57 కోట్ల వ్యయంతో నీరుకొండ రిజర్వాయర్ వరద నియంత్రణ పనులతో పాటు, ట్రంక్ ఇన్ర్ఫా పనుల కోసం టెండర్లు పిలిచింది. తాజాగా పిలిచిన టెండర్లతో ఏడీసీ పరిధిలో ఇప్పటి వరకు మొత్తం విలువ రూ. 3,643.88 కోట్లకు చేరింది. తాజాగా పిలిచిన టెండర్లలో కొండవీడు వాగు, పాలవాగు విస్తరణ, కృష్ణాయపాలెం రిజర్వాయర్, వరదనీటి మళ్లింపు కాల్వలు ఉన్నాయి. అనంతవరం నుంచి ఉండవల్లి వరకు 23.60 కిలోమీటర్లు కొండవీడు వాగు విస్తరణాభివృద్ధి పనులు, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.70 కిలోమీటర్ల మేర పాలవాగు విస్తరణాభివృద్ధి కోసం రూ. 462.26 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. అలాగే, బ్యాలెన్స్ 7.83 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ నిర్మాణ పనులు, 0.1 టీఎంసీల సామర్ధ్యంతో కూడిన కృష్ణాయపాలెం రిజర్వాయర్ పనులకు రూ. 303.73 కోట్ల వ్యయంతో టెండర్ నోటిఫికేషన్ ఇచ్చింది.
ఇక, అమరావతి రాజధానిలో ఈ-8, ఈ-9, ఈ-14, ఎన్-12, ఎన్-6, ఈ-3 (ఫేజ్-1) రోడ్ల పరిధిలో బ్యాలెన్స్ స్మార్ట్ ట్రంక్ ఇన్ర్ఫాస్ట్రక్చర్ పనులతో పాటు, రోడ్లు, వరదనీటి మళ్లింపు కాల్వలు, నీటి సరఫరా నెట్వర్క్, మురుగునీటి నెట్వర్క్, యుటిలిటీ డక్ట్స్, నీటి లైన్లు, నడకదారులు, సైకిల్ ట్రాక్, అవెన్యూ ప్లాంటేషన్ పనులకు సంబంధించి ఏడీసీ టెండర్లు పిలిచింది. ఈ-8 రోడ్డు పరిధిలో రూ. 372.23 కోట్లతో, ఈ-9 రోడ్డు పరిధిలో రూ. 419.96 కోట్లతో, ఈ-14 రోడ్డు పరిధిలో రూ. 241.67 కోట్లతో, ఎన్-12 రోడ్డు పరిధిలో రూ. 443.84 కోట్లతో, ఎన్-6 రోడ్డు పరిధిలో రూ.183.21 కోట్లతో, ఈ-3 రోడ్డు (ఫేజ్-1) పరిధిలో రూ. 364.41 కోట్లతో చేపట్టే పనులకు ఏడీసీ టెండర్లు పిలిచింది.