Share News

Andhra Pradesh: అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం: సీఎం

ABN , Publish Date - Dec 29 , 2025 | 10:13 PM

రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు..

Andhra Pradesh: అన్ని దేవాలయాల్లో శ్రీవారి సేవకులు తరహా విధానం: సీఎం
CM Chandrababu Naidu

అమరావతి, డిసెంబర్ 29: రాష్ట్రంలోని అన్ని దేవాలయాలు శ్రీవారి సేవకుల తరహా విధానాన్ని అవలంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. రెవెన్యూ, వ్యవసాయం, పౌరసరఫరాలు, వైద్యారోగ్యం, రవాణా, అగ్నిమాపక, దేవదాయ సహా పలు శాఖల పనితీరుపై చర్చించారు. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల పనితీరు ఏ విధంగా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సమీక్షించారు.


‘రాష్ట్రంలో ఉన్న అన్ని దేవాలయాల్లో స్థానికంగా వాలంటీర్లను నియమించుకోవాలి. శ్రీవారి సేవకుల తరహాలోనే అన్ని దేవాలయాల్లో సేవలు చేసే వారిని గుర్తించాలి. వారి జాబితాను సిద్దం చేయాలి.. వారి సేవలను వినియోగించుకోవాలి. భగవంతుని సేవ చేసేందుకు చాలా మంది భక్తులు ముందుకు వస్తారు. ఇలా ముందుకు వచ్చిన వారిని ప్రొత్సహించండి. శ్రీశైలంలోనూ ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా పీహెచ్‌సీలు, అర్బన్ పీహెచ్‌సీ, సీహెచ్‌సీలు మొదలుకుని జిల్లా ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు ఉండాలి. పరిశుభ్రతతో ఉండాలి. కలెక్టర్లు రెగ్యులర్ అంశాలపై ఫోకస్ చేస్తూనే.. కీలకమైన శాఖలు, విభాగాలపై మరింత శ్రద్ధ పెట్టాలి. ప్రజలు నిత్యం సందర్శించే ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాస్పత్రుల్లో క్షేత్ర స్థాయి పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. రోగాల బారిన పడి వచ్చే వారికి మంచి సేవలు అందించాలి. డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. సర్వేలు చేపట్టే విషయంలో ఎలాంటి తప్పిదాలు జరగకూడదు. సర్వే చేయించుకునే వారు ఇబ్బందులు పడకూడదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ యంత్రాంగం పని చేయాలి. రెవెన్యూ శాఖకు కొన్ని విషయాల్లో ఉన్న చెడ్డ పేరు తొలగించుకునేలా చేయాలి.’


‘రాష్ట్రంలో భూసార పరీక్షలు నిర్వహించాలి. పరీక్షల అనంతరం మట్టిలో పోషక విలువలు ఏ మేరకు ఉన్నాయి.. ఆ మట్టి ఎంత సారవంతంగా ఉందనే విషయాన్ని గుర్తించాలి. ఎరువుల వినియోగం వల్ల భూసారం తగ్గినా.. కలుషితమైనా సమాచారాన్ని రైతులు అందరికీ తెలియజేయాలి. తక్కువ యూరియా వినియోగించుకున్నా.. పంటలు ఎలా పండుతాయో వివరించాలి. ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే.. ఎలాంటి ఉత్పత్తులు పండించాలో రైతులకు అవగాహన కల్పించాలి. మెరుగైన ప్రజారోగ్యం కోసం వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలు కలిసి పని చేయాలి. క్షేత్ర స్థాయిలో ఉండే ఆర్ఎస్‌కే-పీహెచ్‌సీ లు కలిసి పని చేయండి. దీనిపై వ్యవసాయ, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పూర్తి స్థాయి ఫోకస్ పెట్టాలి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఫిర్యాదులు రాకుండా చూసుకోండి. ఎక్కడైనా మిల్లర్లు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తే.. నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోండి. రవాణా శాఖ కూడా తన పనితీరును మరింత మెరుగు పరుచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలి.’ అని ఆయా శాఖల అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే సమయంలో అగ్నిమాపక శాఖ పనితీరు బాగుందంటూ ఆ శాఖ అధికారులను సీఎం అభినందించారు.


Also Read:

Hyderabad: ఘోర విషాదం.. కొడుకును చూసేందుకు వచ్చి..

AP News: అవి ముమ్మాటికీ జగన్ హత్యలే.. మంత్రి కొల్లు రవీంద్ర షాకింగ్ కామెంట్స్..

Picture Puzzle: మీ ప్రతిభకు పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 25 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Dec 29 , 2025 | 10:13 PM