Share News

Siricilla: కన్నకూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు..

ABN , Publish Date - May 20 , 2024 | 03:52 AM

మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు.

Siricilla: కన్నకూతుర్ని కడతేర్చిన తల్లిదండ్రులు..

  • మానసిక స్థితి బాగోలేని కుమార్తెను వదిలించుకోవాలని హత్య

  • అనారోగ్యంతోనే మరణించిందని నమ్మించి అంత్యక్రియలు

  • గ్రామస్థుల అనుమానంతో బయటికొచ్చిన నిజం

  • నిందితుల అరెస్టు, రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఘటన

సిరిసిల్ల క్రైం, మే 19: మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న కూతురు వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక కన్నవాళ్లే ఆమెను హత్య చేశారు. ఆ తప్పు బయటపడకుండా ఉండాలని తమ ఒక్కగానొక్క బిడ్డ అనారోగ్యంతో మరణించిందని కూతురి అత్తింటి వారిని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేశారు. కానీ, నిజం బయటకు రావడంతో కటకటాలపాలయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆ జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదివారం వెల్లడించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన చెప్యాల ఎల్లవ్వ, నర్సయ్య దంపతుల ఏకైక కుమార్తె ప్రియాంక(24) ఏడేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతోంది. ప్రియాంకకు ఆస్పత్రిలో చికిత్స చేయించగా కొంతవరకు నయమైంది. దీంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గపల్లికి చెందిన పృథ్వితో ప్రియాంకకు 2020లో పెళ్లి చేశారు. ప్రియాంక దంపతులకు ఓ కుమారుడు(13 నెలలు) ఉన్నాడు.


మానసిక సమస్యలు తిరగబెట్టడంతో ప్రియాంక నెల రోజులుగా కుటుంబసభ్యులందరినీ ఇబ్బంది పెడుతుంది. అంతేకాక, పసివాడని కూడా చూడకుండా కన్నకొడుకును కొట్టి కింద పడేస్తుండేది. పృథ్వీ ఈ విషయాన్ని అత్తమామల దృష్టికి తీసుకెళ్లగా వారు ప్రియాంకను పుట్టింటికి తీసుకెళ్లారు. ప్రియాంకకు చికిత్స చేయించేందుకు తల్లిదండ్రులు మళ్లీ కొంత ఖర్చుపెట్టగా అప్పులు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రియాంకను వదిలించుకోవాలని భావించిన తల్లిదండ్రులు ఈనెల 14న అర్ధరాత్రి తమ ఇంట్లోనే ఉరివేసి కూతురిని హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ప్రియాంక అత్తింటికి తరలించారు. ప్రియాంక మానసిక వ్యాధితో మరణించిందని ఆమె భర్త పృథ్విని నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. అయితే, ప్రియాంక మరణంపై నేరెళ్ల గ్రామానికి చెందిన పలువురు అనుమానాలు వ్యక్తం చేయడంతో గ్రామ కార్యదర్శి ద్వారా ఫిర్యాదు స్వీకరించిన ఎస్పీ విచారణకు ఆదేశించారు. దీంతో ప్రియాంక తల్లిదండ్రులను విచారించగా అసలు విషయం బయటపెడింది. దీంతో వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - May 20 , 2024 | 03:52 AM