Share News

Telangana Politics: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తిర పరిణామం.. సీన్ రిపీట్ అయ్యేనా!?

ABN , Publish Date - Apr 10 , 2024 | 09:17 AM

రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలకు 2019 ఎన్నికలు పూర్తిగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు. 2018 డిసెంబర్‌ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) కొడంగల్‌ నియోజకవర్గం(Kodangal) నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

Telangana Politics: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తిర పరిణామం.. సీన్ రిపీట్ అయ్యేనా!?
Telangana Elections

నాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినప్పటికీ.. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక బరిలో నిలిచి పలువురు విజయదుందుభి మోగించారు. పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పదవులు పొందారు. రాజకీయంగా మరింత ఉన్నతస్థాయికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే మల్కాజిగిరిలో ఈసారి అలాంటి సీన్‌ రిపీట్‌ కానుందా అనే ఆసక్తి నెలకొంది.

రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలకు 2019 ఎన్నికలు పూర్తిగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు. 2018 డిసెంబర్‌ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) కొడంగల్‌ నియోజకవర్గం(Kodangal) నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. అలాగే, నగరంలోని అంబర్‌పేట అసెంబ్లీ నుంచి ప్రస్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Kishan Reddy) పోటీచేసి కొద్దిపాటి తేడాతో ఓటమి పాలయ్యారు. అయితే, పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న ఇద్దరు నేతలను అసెంబ్లీ ఎన్నికలు తీవ్ర నిరాశకు గురిచేసినప్పటికీ.. పార్లమెంట్‌ ఎన్నికలు వరంగా మారాయి. కొడంగల్‌లో ఓడిపోయిన రేవంత్‌రెడ్డి.. 2019 ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. గ్రేటర్‌లోని మల్కాజిగిరి పార్లమెంట్‌ స్థానం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థిపై 80,392 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. అలాగే, అంబర్‌పేటలో ఓడిపోయిన కిషన్‌రెడ్డి.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నుంచి బరిలోకి దిగి విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థిపై 62,114 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కేవలం నాలుగు నెలల్లోనే ఇద్దరు నేతలకు విజయం వరించింది. ఇదిలా ఉండగా, పార్లమెంట్‌లోకి అడుగు పెట్టిన తర్వాత రేవంత్‌రెడ్డి దశ మారిపోయింది. అప్పట్లో రాష్ట్ర కాంగ్రె్‌సలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయనకు రెండేళ్లలో టీపీసీసీ ప్రెసిడెంట్‌ పదవి లభించింది. తాజా ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. కాగా, ఎంపీగా గెలుపొందిన కిషన్‌రెడ్డికి మోదీ ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి పదవి లభించింది.

ఇలాంటి సీన్‌ రిపీట్‌ కానుందా..?

రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ పార్టీకి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. 119 స్థానాల్లో కేవలం 39 సీట్లను దక్కించుకుని ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. అయితే, 64 సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుత పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయం సాధించేందుకు కృషి చేస్తోంది. ఈ మేరకు గ్రేటర్‌లోని ఆయా సెగ్మెంట్ల నుంచి బలమైన అభ్యర్థులను బరిలో నిలిపింది. తాజా ఎన్నికల్లో 2019 నాటి సీన్‌ రిపీట్‌ కానుందా.. అనే చర్చ జరుగుతోంది.

ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని హుజూరాబాద్‌ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన బీజేపీ నేత ఈటల రాజేందర్‌ ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి బరిలో దిగుతున్నారు. హుజురాబాద్‌లో ఓటమి చెందిన రాజేందర్‌కు మల్కాజిగిరి కలిసి వస్తుందా.. లేదా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఖైరతాబాద్‌లో ఎమ్మెల్యేగా గెలుపొందిన దానం నాగేందర్‌.. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌లో విజయకేతనం ఎగురవేసి డబుల్‌ విక్టరీని సొంతం చేసుకుంటాడా.. లేదా అనే ఆసక్తి నెలకొంది. ఏదేమైనా అగ్రనేతల అదృష్టాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 10 , 2024 | 09:17 AM