D. Raja: అమిత్షాను క్యాబినెట్ నుంచి తొలగించాలి
ABN , Publish Date - Dec 31 , 2024 | 04:39 AM
రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్షాను మంత్రి పదవి నుంచి ప్రధాని నరేంద్రమోదీ తొలగించాలని సీపీఐ జాతీయ ప్రఽధాన కార్యదర్శి డి.రాజా అన్నారు.
సీపీఐ రాష్ట్ర బహిరంగ సభలో డి.రాజా
నల్లగొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతిప్రతినిధి): రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్షాను మంత్రి పదవి నుంచి ప్రధాని నరేంద్రమోదీ తొలగించాలని సీపీఐ జాతీయ ప్రఽధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. అంబేడ్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయన వెంటనే జాతికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం నల్లగొండలోని ఎన్జీ కళాశాలలో సీపీఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి అధ్యక్షతన సీపీఐ శతవార్షికోత్సవాల్లో భాగంగా రాష్ట్రస్థాయి బహిరంగ సభ జరిగింది. ఈ సభకు హాజరయిన డి.రాజా మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేడ్కర్, అందరికీ సమాన హక్కులను కల్పించారని అన్నారు.
రాజ్యాంగ మూలాలను మార్చేందుకు నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, దాని మాతృసంస్థ ఆర్ఎ్సఎస్ ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలను అడ్డుకునేందుకు దేశంలోని వామపక్షాలు, లౌకిక ప్రజా శక్తులు ఐక్యంగా పోరాటానికి కలిసి రావాలని రాజా పిలుపునిచ్చారు. అనంతరం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఫాసిజం ప్రబలి ఉందని.. ఈ సమయంలో కమ్యూనిస్టులు పోరాటం చేయాల్సిన అవసరముందని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ అధికారం కోసం పాకులాడే పార్టీ కాదని అన్నారు. కమ్యూనిస్టు పార్టీ పనైపోయిందని అంటున్నారని, ప్రశ్న ఉన్నంత కాలం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందని కూనంనేని స్పష్టం చేశారు. సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ అజీజ్పాషా, మాజీ ఎమ్మెల్యేలు చాడ వెంకట్రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు, పశ్య పద్మ, జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం తదితరులు పాల్గొన్నారు.
వీల్చైర్, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్తో సభకు సురవరం
సీపీఐ మాజీ జాతీయ ప్రధానకార్యదర్శి సురవరం సుధాకర్రెడ్డి ఆరోగ్యం సహకరించకున్నా పట్టుదలగా సభకు వచ్చారు. ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ సహాయంతో ముక్కుకు ఆక్సిజన్ పైపు తగిలించుకొని, వీల్చైర్లో సహాయకుల సహకారంతో సభకు హాజరయ్యారు. తాను మూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యానని, నల్లగొండలో సభ అనేసరికి తాను హాజరవ్వాల్సిందేనని నిర్ణయించుకున్నానని సురవరం చెప్పారు. తనను రెండుసార్లు పార్లమెంటుకు ఎన్నుకున్న ఇక్కడి ప్రజలకు లాల్సలాం చెప్పాలనే తాను ఈ సభకు హాజరయ్యానని సురవరం పేర్కొనడంతో సభ చప్పట్లతో మార్మోగింది.