Share News

రేషన్‌ కార్డుల జారీకి మార్గం సుగమం

ABN , Publish Date - Dec 16 , 2024 | 10:21 PM

కొత్త రేషన్‌ కార్డుల జారీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రేషన్‌ కార్డుల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్‌ కార్డులు మంజూరు చేయడం లేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారితో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారు రేషన్‌ కార్డులు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు.

రేషన్‌ కార్డుల జారీకి మార్గం సుగమం

మంచిర్యాల, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కొత్త రేషన్‌ కార్డుల జారీకి ఎట్టకేలకు మార్గం సుగమమైంది. రేషన్‌ కార్డుల కోసం రాష్ట్రంలో లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు. చాలా ఏళ్లుగా రాష్ట్రంలో రేషన్‌ కార్డులు మంజూరు చేయడం లేదు. దీంతో కుటుంబాలు వేరు పడిన వారితో పాటు కొత్తగా వివాహం చేసుకున్న వారు రేషన్‌ కార్డులు ఎప్పుడెప్పుడు జారీ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో అమలయ్యే ప్రభుత్వ పథకాలకు రేషన్‌ కార్డు లింక్‌ ఉండటంతో ఆశావహులు వీటి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు. త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, సంక్రాంతి పండుగ నుంచి రేషన్‌ కార్డుల మంజూరు మొదలవుతుందని ప్రకటించారు. రేషన్‌ కార్డులతో పాటు సన్న బియ్యం కూడా అర్హులకు అందిస్తామని అసెంబ్లీ వేదికగా మంత్రి ఉత్తమ్‌ ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

నిలిచిపోయిన రేషన్‌కార్డుల జారీ

ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018 వరకు రేషన్‌ కార్డు లను జారీ చేసింది. 2018 డిసెంబర్‌లో జరిగిన ముం దస్తు అసెంబ్లీ ఎన్నికల అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ పార్టీ రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియను నిలిపివేసింది. కార్డుల కోసం అనేకమంది దరఖాస్తు చేసుకోగా వాటిని 2022లో పరిశీలించి, అందులో అర్హులైన వారికి కొత్త కార్డులను జారీ చేశారు. ఆ తరువాత వెబ్‌సైట్‌ను మూసివేసిన ప్రభుత్వం మళ్లీ రేషన్‌కార్డులు ఇవ్వలేదు.

ఎన్నికల సమయంలో ఆరు గ్యారంటీ పథకాలతో పాటు కొత్త రేషన్‌ కార్డులను జారీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. 2023 డిసెంబరు 9వ తేదీ నుంచి ఆరు గ్యారంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, చేయూత పథకంతో రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి 10 లక్షలకు వైద్య చికిత్సలు అందించే కార్యక్ర మాన్ని ప్రారంభించారు. పలు పథకాలు అమలు చేసేందుకు ప్రజాపాలన గ్రామ, వార్డు సభల్లో ఐదు గ్యారంటీ పథకాలు వర్తింప జేసేందుకు స్వీకరించిన దరఖాస్తులతోపాటు, కొత్త రేషన్‌ కార్డుల కోసం అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. వీటితోపాటు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రేషన్‌ కార్డుల జారీకి మోక్షం కలగలేదు.

జిల్లాలో 15వేల పైచిలుకు దరఖాస్తులు.....

జిల్లాలో రేషన్‌ కార్డుల కోసం 15వేల పై చిలుకు దరఖాస్తులు వచ్చాయి. వాటిని జిల్లా అధికారులు ప్రభుత్వానికి పంపించారు. ఆ తర్వాత కొత్త రేషన్‌ కార్డుల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం, పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చైర్మన్‌గా, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహా సభ్యులుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘం అర్హులైన వారికి రేషన్‌ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేసింది. 2023 డిసెంబరు 2వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించినప్పటికీ, ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ప్రస్తుతం లైన్‌ క్లియర్‌ కావడంతో దరఖాస్తుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్‌ కార్డులు లేక మార్చి 1 నుంచి అమల్లోకి వచ్చిన రూ.500కే సబ్సిడీ వంట గ్యాస్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ సౌకర్యం పొందలేకపోతున్నారు. రేషన్‌కార్డు ఆధారంగా రూ.2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేయగా, కార్డులు లేని వారికి రుణమాఫీ కాలేదు. రేషన్‌ కార్డు ఉంటే అందరితోపాటు తమకు కూడా రుణమాఫీ అయ్యేదనే అభిప్రాయాలు రైతుల నుంచి వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం మంత్రి ప్రకటనతో లైన్‌ క్లియర్‌ కాగా, ఇప్పటికైనా ప్రభుత్వం కొత్త రేషన్‌ కార్డుల జారీతోపాటు కొత్త దరఖాస్తులు స్వీకరించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Dec 16 , 2024 | 10:21 PM