Share News

IND vs ENG: ఐదో ఆటగాడు అరంగేట్రం ఖాయం? లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ కుర్రాడు ఎవరంటే..

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:58 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల గాయాలు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా మహ్మద్ షమీ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్‌కు దూరం కాగా.. కేఎల్ రాహల్ 3 టెస్టులకు దూరమయ్యాడు. చివరిదైన ఐదో టెస్టులో ఆడడం కూడా అనుమానంగానే ఉంది.

IND vs ENG: ఐదో ఆటగాడు అరంగేట్రం ఖాయం? లక్కీ ఛాన్స్ కొట్టేసిన ఆ కుర్రాడు ఎవరంటే..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో ఆటగాళ్ల గాయాలు టీమిండియాను ఇబ్బంది పెడుతున్నాయి. గాయం కారణంగా మహ్మద్ షమీ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. రవీంద్ర జడేజా ఒక మ్యాచ్‌కు దూరం కాగా.. కేఎల్ రాహల్ 3 టెస్టులకు దూరమయ్యాడు. చివరిదైన ఐదో టెస్టులో ఆడడం కూడా అనుమానంగానే ఉంది. వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ కూడా సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. గాయాలకుతోడు ఫామ్ కూడా కోల్పోవడంతో శ్రేయాస్ అయ్యర్‌ను జట్టు నుంచి తప్పించారు. దీనికి తోడు బుమ్రాకు నాలుగో టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఇలా కీలక ఆటగాళ్లు దూరం కాబడంతో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో భారత జట్టు ఎక్కువగా కుర్రాళ్లతోనే ఆడింది. ఈ సిరీస్‌లో ఇప్పటికే నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. ధృవ్ జురేల్, సర్ఫరాజ్ ఖాన్, ఆకాష్ దీప్, రజత్ పటీదార్ అరంగేట్రం చేశారు. అయినప్పటికీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో యువ జట్టు అద్భుతంగా ఆడింది. ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించి మరో టెస్టు మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే తాజాగా చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ద్వారా మరో ఆటగాడు కూడా అరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. దీంతో ఈ సిరీస్‌లో అరంగేట్రం చేసే భారత ఆటగాళ్ల సంఖ్య ఏకంగా ఐదుకు పెరగనుంది.


ఈ సిరీస్‌లో ఇప్పటివరకు అరంగేట్రం చేసిన నలుగురు భారత ఆటగాళ్లలో రజత్ పటీదార్ మినహా మిగతా ముగ్గురు అదరగొడుతున్నారు. మొదటి టెస్ట్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో రజత్ పటీదార్ జట్టులోకి వచ్చాడు. కానీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలో పటీదార్ విఫలమయ్యాడు. ఆడిన 6 ఇన్నింగ్స్‌ల్లో 32, 9, 17, 0, 5, 0 పరుగులు మాత్రమే చేశాడు. కనీసం ఒకసారి కూడా 50 పరుగుల మార్కు అందుకోలేకపోయాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత్ ఏ తరఫున అదరకొట్టిన పటీదార్ ఇక్కడ మాత్రం రాణించలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తిరిగి ఫామ్‌లోకి రావడానికి రంజీలు ఆడాల్సిందిగా రజత్ పటీదార్‌ను బీసీసీఐ ఆదేశించినట్టు తెలుస్తోంది. దీంతో మార్చి 3 నుంచి ప్రారంభంకానున్న రంజీ ట్రోఫీ సెమీస్‌ పోటీల్లో పటీదార్ బరిలోకి దిగనున్నాడని తెలుస్తోంది. విదర్భతో జరిగే సెమీస్ పోరులో మధ్యప్రదేశ్ తరఫున బరిలోకి దిగనున్నాడని సమాచారం. రాహుల్ కూడా ఐదో టెస్టు ఆడే అవకాశాలు లేకపోవడంతో మరో కొత్త ఆటగాడిని తుది జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. అదే జరిగితే కర్ణాటక ఎడమ చేతి బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌కు తుది జట్టులో చోటు ఖాయమనే చెప్పుకోవాలి. దీంతో టెస్టుల్లో పడిక్కల్ అరంగేట్రం చేయనున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. కాగా తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లాడిన పడిక్కల్ 44 సగటుతో 2227 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే ఇప్పటికే సిరీస్ గెలవడంతో పటీదార్‌కు మరో అవకాశం ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పలువురు అంటున్నారు. కాగా భారత్, ఇంగ్లండ్ మధ్య మార్చి 7 నుంచి ఐదో టెస్టు ప్రారంభంకానుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 05:59 PM