Share News

DC vs CSK: చెలరేగిన పంత్, వార్నర్.. చెన్నై ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Mar 31 , 2024 | 09:31 PM

చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ బ్యాటర్లు రిషబ్ పంత్(51), డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరికి తోడు యువ ఓపెనర్ పృథ్వీషా(43) కూడా రాణించాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

DC vs CSK: చెలరేగిన పంత్, వార్నర్.. చెన్నై ముందు భారీ లక్ష్యం

విశాఖ: చెన్నైసూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ బ్యాటర్లు చెలరేగారు. టాపార్డర్ బ్యాటర్లు రిషబ్ పంత్(51), డేవిడ్ వార్నర్(52) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. వీరికి తోడు యువ ఓపెనర్ పృథ్వీషా(43) కూడా రాణించాడు. దీంతో చెన్నైసూపర్ కింగ్స్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 192 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్లు వార్నర్, పృథ్వీషా తొలి వికెట్‌కు 93 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఢిల్లీ 191/5 పరుగుల భారీ స్కోర్ సాధించింది. చెన్నై జట్టులో యువ పేసర్ మతీష పతీరణ (3/31) చెలరేగాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. ధాటిగా బ్యాటింగ్ చేసిన వీరిద్దరు తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. ఈ క్రమంలో డేవిడ్ వార్నర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఐపీఎల్‌లో వార్నర్‌కు ఇది 62వ హాఫ్ సెంచరీ.


సెంచరీ దిశగా సాగుతున్న వీరి భాగస్వామ్యాన్ని 10వ ఓవర్‌లో పేసర్ ముస్తిఫిజుర్ విడదీశాడు. 5 ఫోర్లు, 3 సిక్సులతో 35 బంతుల్లో 52 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్‌ను ఔట్ చేశాడు. ఆ కాసేపటికే 4 పోర్లు, 2 సిక్సులతో 27 బంతుల్లో 43 పరుగులు చేసిన మరో ఓపెనర్ పృథ్వీ షాను స్పిన్నర్ రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చాడు. దీంతో 103 పరుగులకు ఢిల్లీ 2 వికెట్లు కోల్పోయింది. అనంతరం మూడో వికెట్‌కు మిచెల్ మార్ష్‌తో కలిసి కెప్టెన్ రిషబ్ పంత్ 31 పరుగులు జోడించాడు. 15వ ఓవర్‌లో చెన్నై పేసర్ మతీషా పతిరణ చెలరేగాడు. ఒకే ఓవర్‌లో మిచెల్ మార్ష్(18), ట్రిస్టన్ స్టబ్స్‌ను ఔట్ చేశాడు. స్టబ్స్ డకౌట్ అయ్యాడు. దీంతో 134 పరుగులకు ఢిల్లీ 4 వికెట్లు కోల్పోయింది.

అనంతరం రిషబ్ పంత్ చెలరేగాడు. డెత్ ఓవర్లలో వరుసగా ఫోర్లు, సిక్సులు బాది ఢిల్లీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అక్షర్ పటేల్ సాయంతో ఐదో వికెట్‌కు 23 బంతుల్లో 44 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో రిషబ్ పంత్ తన ఐపీఎల్ కెరీర్‌లో 16వ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 4 ఫోర్లు, 3 సిక్సులతో 32 బంతుల్లో 51 పరుగులు చేసిన పంత్ భారీ షాట్‌కు ప్రయత్నించి పతిరణ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ముస్తిఫిజుర్ రహ్మాన్ వేసిన చివరి ఓవర్లో 12 పరుగులొచ్చాయి. మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 191/5 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో పతిరణ 3, జడేజా, ముస్తిఫిజర్ తలో వికెట్ తీశారు.

Updated Date - Mar 31 , 2024 | 09:41 PM