Share News

BCCI: ఐపీఎల్‌కు ముందు రంజీలపై ఫోకస్ పెట్టండి.. వారికి బీసీసీఐ వార్నింగ్

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:28 PM

పలువురు భారత ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తితో ఉందా? తమ ఆదేశాలను పాటించకపోవడంపై గుర్రుగా ఉందా? కొంతమంది ఆటగాళ్లు రంజీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యతం ఇవ్వడంపై ఆగ్రహంతో ఉందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు.

BCCI: ఐపీఎల్‌కు ముందు రంజీలపై ఫోకస్ పెట్టండి.. వారికి బీసీసీఐ వార్నింగ్

పలువురు భారత ఆటగాళ్లపై బీసీసీఐ అసంతృప్తితో ఉందా? తమ ఆదేశాలను పాటించకపోవడంపై గుర్రుగా ఉందా? కొంతమంది ఆటగాళ్లు రంజీ క్రికెట్ కంటే ఐపీఎల్‌కు ప్రాధాన్యత ఇవ్వడంపై ఆగ్రహంతో ఉందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ కంటే ముందు దేశీయ రంజీ ట్రోఫీకి ప్రాధాన్యత ఇవ్వాలని ఆటగాళ్లకు బీసీసీఐ సూచించిందట. రంజీ ట్రోఫీ పాల్గొనడానికి బదులు ఐపీఎల్ 2024 కోసం సిద్ధమవుతున్న ఇషాన్ కిషన్‌తో సహా కొంతమంది ఆటగాళ్లను బీసీసీఐ పరోక్షంగా హెచ్చరించిందని సమాచారం. ‘‘రాబోయే రోజుల్లో జాతీయ జట్టులో లేని ఆటగాళ్లంతా రంజీ ట్రోఫీలో తమ తమ రాష్ట్ర జట్టు తరఫున ఆడాలని బీసీసీఐ తెలియచేసింది. గాయాల బారిన పడి ఎన్సీఏలో కోలుకుంటున్న ఆటగాళ్లకు మాత్రమే బీసీసీఐ ఆదేశాల నుంచి మినహాయింపు ఉంది. మిగతా వారంతా ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఆడాల్సిందే’’ అని పలు నివేదికలు తెలిపాయి.


పేర్లు స్పష్టంగా చెప్పక పోయినప్పటికీ జనవరి నుంచే ఐపీఎల్ మూడ్‌లో ఉన్న ఆటగాళ్లకు బీసీసీఐ వార్నింగ్ ఇచ్చింది. ముఖ్యంగా ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా విషయంలో బీసీసీఐ అసంతృప్తితో ఉందని సమచారం. వారిని రంజీ క్రికెట్‌లో ఆడాలని బీసీసీఐ సూచించింది. కానీ వారు మాత్రం రంజీలను పక్కన పెట్టి ఇప్పటి నుంచే ఐపీఎల్‌కు సిద్ధమవుతున్నారు. హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ ఐపీఎల్ కోసమే బరోడాలో శిక్షణ తీసుకుంటున్నారు. గత సౌతాఫ్రికా పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న ఇషాన్ కిషన్ ఇంగ్లండ్‌తో సిరీస్‌లో కూడా ఆడడం లేదు. అసలు కిషన్ ఎందుకు ఆడడం లేదో ఇప్పటికీ స్పష్టత లేదు. మొత్తంగా వారు సాంప్రదాయ రంజీల కంటే లాభదాయమైన టీ20 లీగ్‌కే ప్రాధాన్యత ఇవ్వడం పలు చర్చలకు తావిస్తోంది. కాగా ఆటగాళ్లు రంజీల్లో ఆడడం ద్వారా మంచి ఫిట్‌నెస్ లభించడంతోపాటు ఐపీఎల్‌లోనూ సత్తా చాటగలరని విశ్లేషకులు అంటున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 01:28 PM