Share News

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 04:07 PM

ఐపీఎల్ 2024లో భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిత్యం బద్ద శత్రువులుగా కనిపించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ వేదికగా ఒకటయ్యారు.

IPL 2024: గంభీర్-కోహ్లీకి ఆస్కార్ ఇవ్వాలి.. దిగ్గజ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బెంగళూరు: ఐపీఎల్ 2024లో (IPL 2024) భాగంగా శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru vs Kolkata Knight Riders) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నిత్యం బద్ద శత్రువులుగా కనిపించే టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్(Gautam Gambhir), స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli) ఈ మ్యాచ్ వేదికగా ఒకటయ్యారు. కరచాలనం చేసుకుని ఒకరినొకరు కౌగిలించుకున్నారు. అంతేకాకుండా ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తుండగా స్ట్రాటజిక్ టైమ్ ఔట్ సమయంలో మైదానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో విరాట్ కోహ్లీ క్రీజులో ఉండగా తమ ఆటగాళ్లకు విలువైన సూచనలు ఇవ్వడానికి కేకేఆర్ మెంటార్ గంభీర్ మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ఘటనపై కామెంటేటర్లు రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


‘‘విరాట్ కోహ్లీ-గౌతం గంభీర్ కౌగిలింతకు గాను కేకేఆర్‌కు ఫెయిర్ ప్లే అవార్డు ఇవ్వాల్సిందే’’ అని రవిశాస్త్రి అన్నాడు. ఇంతలోనే మ్యాచ్‌కు మరో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ..‘‘ఫెయిర్ ప్లే అవార్డు మాత్రమే కాదు. ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వాలి’’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న స్పష్టమైన అర్థం ఏంటో గవాస్కర్ చెప్పలేదు. దీంతో గవాస్కర్ వ్యాఖ్యలపై అభిమానులు, నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. పలువురైతే గంభీర్-కోహ్లీది నటన మాత్రమేనని వారిద్దరు మళ్లీ ఏదో ఒక సందర్భంలో గొడవపడతారని, అందుకే గవాస్కర్ ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని అంటున్నారు. అయితే ఇది నిజం కాదని కూడా చెప్పలేం. ఎందుకంటే గంభీర్-కోహ్లీ ఆటగాళ్లుగా ఉన్నప్పుడే ఐపీఎల్‌లో ఓ సారి గొడవపడ్డారు. ఆ సమయంలో ఇద్దరు కెప్టెన్లుగా ఉన్నారు. కేకేఆర్ కెప్టెన్‌గా గంభీర్, ఆర్సీబీ కెప్టెన్‌గా కోహ్లీ ఉన్నాడు. అయితే ఆ తర్వాత ఇద్దరు కలిసి కలిసిపోయారు.

కానీ గతేడాది జరిగిన ఐపీఎల్ (IPL) సందర్భంగా మళ్లీ గొడవపడ్డారు. నవీన్ ఉల్ హక్ విషయమై లక్నో మెంటార్‌గా ఉన్న గంభీర్, కోహ్లీ మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు మాట్లాడుకోలేదు. తాజాగా కోల్‌కతా-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌తో ఇద్దరు తిరిగి కలిశారు. దీంతో గంభీర్-కోహ్లీ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 7 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 82 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్యాన్ని కోల్‌కతా మరో 3 ఓవర్లు మిగిలి ఉండగానే చేధించింది. ఆ జట్టు బ్యాటర్లు వెంకటేష్ అయ్యర్(50), సునీల్ నరైన్(47), శ్రేయాస్ అయ్యర్(39), ఫిలిప్ సాల్ట్(30) చెలరేగారు. ఈ ఓటమితో ఈ సీజన్‌లో హోంగ్రౌండ్‌లో ఓడిన మొదటి జట్టుగా బెంగళూరు నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు లక్నో జట్టులో కీలక మార్పు

SRH vs MI: ముంబై, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో కావ్య మారన్ సెలబ్రేషన్స్ వైరల్.. ఫోకస్ మొత్తం ఆమెపైనే!

Updated Date - Mar 30 , 2024 | 04:12 PM