Share News

IND vs ENG: ముగ్గురు పేసర్లు లేదా ముగ్గురు స్పిన్నర్లు.. ఐదో టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా..

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:57 PM

ఐదు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 3-1తో గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా చివరి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యత ఉండదు.

IND vs ENG: ముగ్గురు పేసర్లు లేదా ముగ్గురు స్పిన్నర్లు.. ఐదో టెస్ట్‌కు టీమిండియా ప్లేయింగ్ 11 ఇదేనా..

ధర్మశాల: ఐదు టెస్టుల సిరీస్‌ను ఇప్పటికే 3-1తో గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న టీమిండియా చివరి టెస్టు మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది. సాధారణంగా అయితే టీమిండియా ఇప్పటికే సిరీస్ గెలవడంతో ఈ మ్యాచ్‌కు అంతగా ప్రాధాన్యత ఉండదు. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సైకిల్‌లో ప్రతి మ్యాచ్ కీలకం కావడంతో ఈ మ్యాచ్‌ను కూడా టీమిండియా తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. దీంతో భారత జట్టు కూడా చివరి మ్యాచ్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోకుండా గెలుపే లక్ష్యంగా సిద్ధమవుతోంది. జట్టు మొత్తం ఇప్పటికే ధర్మశాల చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. అనంత్ అంబానీ-రాధిక వివాహం కోసం ముంబై వెళ్లిన కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మంగళవారం ప్రత్యేక హెలీకాప్టర్‌లో ధర్మశాల చేరుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో తుది జట్టు ఎంపిక టీమిండియాకు కాస్త ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. తుది జట్టులో ముగ్గురు పేసర్లను ఆడించాలా? లేక ముగ్గురు స్పిన్నర్లను ఆడించాలా? అనే విషయమై టీమిండియా మేనేజ్‌మెంట్ కాస్త డైలామాలో ఉన్నట్టు సమాచారం.


సాధారణంగా మ్యాచ్ జరిగే ధర్మశాల పిచ్‌ కాస్త పేస్‌కు అనుకూలిస్తుంది. పైగా మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పిచ్‌పై పచ్చిక ఉండే అవకాశాలున్నాయి. ఇది పేసర్లకు లాభించనుంది. ఈ పరిస్థితులు ఇంగ్లండ్ పేసర్లకు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడ ముగ్గురు స్పిన్నర్ల కన్నా, ముగ్గురు పేసర్లతో ఆడడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ధర్మశాలలో పరిస్థితులు ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అవకాశాలున్నాయని కాబట్టి టీమిండియా జాగ్రత్తగా ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ధర్మశాలలో ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది. 2017లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ మొత్తంలో 32 వికెట్లు పడగా.. పేసర్లే 14 తీశారు. అయితే గురువారం మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్‌ను పరిశీలించాకే తుది జట్టును ఎంపిక చేసే అవకాశాలున్నాయి. ప్రధానంగా టీమిండియా తుది జట్టులో ఒక మార్పు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. ఈ సిరీస్‌లో ఆడిన మూడు టెస్టుల్లో దారుణంగా విఫలమైన అరంగేట్ర ఆటగాడు రజత్ పటీదార్ స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.

ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్ ఆడనున్నారు. వన్‌డౌన్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ చేయనున్నాడు. నాలుగో స్థానంలో దేవదత్ పడిక్కల్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే పడిక్కల్ అరంగేట్రం ఖాయమనే చెప్పుకోవాలి. ఐదో స్థానంలో సర్ఫరాజ్ ఖాన్, ఆరో స్థానంలో రవీంద్ర జడేజా, ఏడో స్థానంలో వికెట్ కీపర్ ధృవ్ జురేల్ ఆడనున్నాడు. స్పిన్ కోటాలో జడేజాకు తోడుగా రవిచంద్రన్ అశ్విన్ ఖాయం కాగా.. పేస్ కోటాలో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. మూడో స్పిన్నర్‌ను ఆడించాలని భావిస్తే కుల్దీప్ యాదవ్ జట్టులో కొనసాగనున్నాడు. మూడో బౌలర్‌గా స్పిన్నర్ కాకుండా పేసర్ కావాలనుకుంటే ఆకాష్ దీప్‌ను ఆడించనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగనుంది.

టీమిండియా తుది జట్టు(అంచనా)

రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురేల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్/ఆకాష్ దీప్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 02:51 PM