Share News

Badminton: చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. చరిత్రలోనే తొలిసారిగా..

ABN , Publish Date - Feb 17 , 2024 | 03:48 PM

భారత బ్యాడ్మింటన్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖరారు చేసుకున్న అమ్మాయిలు ప్రస్తుతం ఫైనల్లో అడుగుపెట్టి కనీసం సిల్వర్ పతకం ఖరారు చేసుకున్నారు.

Badminton: చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. చరిత్రలోనే తొలిసారిగా..

భారత బ్యాడ్మింటన్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖరారు చేసుకున్న అమ్మాయిలు ప్రస్తుతం ఫైనల్లో అడుగుపెట్టి కనీసం సిల్వర్ పతకం ఖరారు చేసుకున్నారు. ఉత్కంఠభరితంగా సాగిన సెమీస్ పోరులో జపాన్‌పై భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు 3-2 తేడాతో గెలిచింది. స్టార్ షట్లర్ పీవీ సింధు సింగిల్స్‌లో ఓడినప్పటికీ, డబుల్స్‌లో అశ్విన్ పొన్నప్పతో కలిసి సత్తా చాటింది. త్రిసా-గాయత్రీ గోపిచంద్ జోడి, కీలకమైన చివరి సెట్‌లో అనమోల్ విజయం సాధించారు. దీంతో భారత్ ఫైనల్ చేరింది. ఆదివారం జరిగే ఫైనల్ పోరులో భారత జట్టు థాయ్‌లాండ్‌తో తలపడనుంది. సింగిల్స్ విభాగంలో తొలి మ్యాచ్‌లో అయా ఒహోరి చేతిలో పీవి సింధు ఓడిపోయింది. 13-21, 20-22తో నిరాశ తప్పలేదు. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఓటమితో ప్రారంభించింది.


ఆ తర్వాత డబుల్స్ విభాగంలో జరిగిన రెండో మ్యాచ్‌లో యువ జోడీ త్రిసా-గాయత్రీ గోపిచంద్ అదరగొట్టారు. 73 నిమిషాల పాటు సాగిన రెండో మ్యాచ్‌లో నమీ మత్సుయమ-చిహారు షిదపై 21-17, 16-21, 22-20 తేడాతో విజయం సాధించారు. దీంతో రెండు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే మూడో మ్యాచ్‌లో నొజోమి ఒకుహర చేతిలో భారత అమ్మాయి అష్మితా ఓడిపోయింది. 21-17, 21-14 నిరాశతప్పలేదు. దీంతో 1-2తో భారత జట్టు మళ్లీ వెనుకబడింది. దీంతో ఫైనల్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయంలో డబుల్స్ విభాగంలో అశ్విని పొన్నప్పతో కలిసి స్టార్ షట్లర్ పీవీ సింధు బరిలోకి దిగింది. 43 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో అద్భుతంగా ఆడి మియుర-అయకో సుకురమోటో జోడిపై 21-14, 21-11తో విజయం సాధించింది. దీంతో సిరీస్ 2-2తో సమం అయ్యింది. దీంతో సెమీస్ పోరు నిర్ణయాత్మక ఐదో మ్యాచ్‌కు వెళ్లింది. చివరిదైన సింగిల్స్ పోటీలో భారత్ తరఫున యువ షట్లర్ అనమోల్ బరిలోకి దిగింది. 52 నిమిషాలపాటు సాగిన పోరులో 29వ ర్యాంకర్ నత్సుకి నిదైరాపై 21-14, 21-11తో అనమోల్ జయకేతనం ఎగురవేసింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత మహిళల జట్టు 3-2 తేడాతో గెలిచి ఫైనల్ చేరింది. ఫైనల్‌లోనూ గెలిస్తే ఆసియా టీమ్ ఛాంపియన్‌షిప్ టోర్నీలో స్వర్ణం గెలవాలనే భారత్ కల నెరవేరనుంది. కాగా ఈ ఈవెంట్‌లో 2016, 2020లో భారత పురుషుల జట్టు కాంస్య పతకాలు గెలిచింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన ఇదే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 03:56 PM