Share News

Google: ఓ వ్యక్తికి షాకిచ్చిన గూగుల్.. ఫోటో అప్‌లోడ్ చేయగానే అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు

ABN , Publish Date - Mar 18 , 2024 | 06:14 PM

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) సంస్థ ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది. తన చిన్నప్పటి ఫోటోను డ్రైవ్‌లో (Google Drive) అప్‌లోడ్ చేసిన పాపానికి.. అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి.. ఈ వ్యవహారంపై ఏడాది నుంచి గూగుల్‌తో పోరాడాడు. తన అకౌంట్‌ని పునరుద్ధరించాలని పదేపదే కోరాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి గుజరాత్ హైకోర్టుని (Gujarat High Court) ఆశ్రయించాడు.

Google: ఓ వ్యక్తికి షాకిచ్చిన గూగుల్.. ఫోటో అప్‌లోడ్ చేయగానే అకౌంట్ బ్లాక్.. హైకోర్టు నోటీసులు

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ (Google) సంస్థ ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఇచ్చింది. తన చిన్నప్పటి ఫోటోను డ్రైవ్‌లో (Google Drive) అప్‌లోడ్ చేసిన పాపానికి.. అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీంతో ఖంగుతిన్న ఆ వ్యక్తి.. ఈ వ్యవహారంపై ఏడాది నుంచి గూగుల్‌తో పోరాడాడు. తన అకౌంట్‌ని పునరుద్ధరించాలని పదేపదే కోరాడు. అయినా ఫలితం లేకపోవడంతో చివరికి గుజరాత్ హైకోర్టుని (Gujarat High Court) ఆశ్రయించాడు. దీంతో.. గూగుల్‌తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు ఏమైందంటే..


గుజరాత్‌కు చెందిన నీల్ శుక్లా (Neel Shukla) అనే వ్యక్తి కంప్యూటర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. గతేడాది ఏప్రిల్‌లో ఆయన తన చిన్ననాటి ఫోటోలను డ్రైవ్‌లో అప్‌లోడ్ చేశాడు. వాటిల్లో.. తనకు రెండేళ్ల వయసు ఉన్నప్పుడు నానమ్మ తనని స్నానం చేయిస్తున్న ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోలో దుస్తులు లేకపోవడంతో.. ‘చైల్డ్‌ అబ్యూజ్‌’ కిందకు వస్తుందంటూ గూగుల్ సంస్థ అతని అకౌంట్‌ని బ్లాక్ చేసింది. దీనిపై అతను వివరణ ఇస్తూ.. తన ఖాతాను పునరుద్ధరించాలని ఆ సంస్థని పదే పదే అభ్యర్థించాడు. అయినా ఫలితం లేకుండా పోయింది. ఇంతలో గూగుల్ అతనికి మరోసారి నోటీసులు పంపించింది. అకౌంట్‌ని బ్లాక్ చేసి ఏడాది అవుతోంది కాబట్టి.. ఖాతాతో అనుసంధానమై ఉన్న డేటాను ఏప్రిల్ కల్లా తొలగిస్తామని ఆ నోటీసుల్లో పేర్కొంది.

ఈ నేపథ్యంలోనే నీల్ శుక్లా ఈ వ్యవహారంపై గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించాడు. గత ఏడాది నుంచి తన ఖాతా నిలిచిపోవడంతో.. ఈ-మెయిల్ అకౌంట్‌ని వినియోగించలేకపోతున్నానని, ముఖ్యమైన ఈ-మెయిల్స్‌ చూడకపోవడంతో తన వ్యాపారానికి నష్టం వాటిల్లిందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. దీనిపై వెంటనే విచారణ జరపాలని.. తన న్యాయవాది ద్వారా కోర్టుకు వేడుకున్నాడు. దీంతో.. కోర్టు అతని పిటిషన్‌ని విచారించి.. గూగుల్‌తో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. మార్చి 26లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 06:14 PM