Share News

TS Politics : బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటో చెప్పిన కేటీఆర్!

ABN , Publish Date - Jan 07 , 2024 | 05:54 PM

KTR On BRS Defeat : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని.. కాస్త సీట్లు తక్కువ అయినా గెలిచేది ‘కారు’ పార్టీయేనని గులాబీ నేతలు భావించారు కానీ సీన్ మొత్తం రివర్స్ కావడం.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి..

TS Politics : బీఆర్ఎస్ ఓటమికి కారణాలేంటో చెప్పిన కేటీఆర్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఊహించని రీతిలో ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తామని.. కాస్త సీట్లు తక్కువ అయినా గెలిచేది ‘కారు’ పార్టీయేనని గులాబీ నేతలు భావించారు కానీ సీన్ మొత్తం రివర్స్ కావడం.. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రమాణ స్వీకారం చేయడం అన్నీ చకచకా జరిగిపోయాయి. బీఆర్ఎస్ ఎలా ఓటమిపాలయ్యింది..? ఏయే అంశాలు దెబ్బకొట్టాయి..? బీఆర్ఎస్‌పై ప్రజలు ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారు..? కాంగ్రెస్‌కు కలిసొచ్చిన అంశాలేంటి..? అనేదానిపై పార్టీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR).. పార్టీ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కేటీఆర్ ఏమన్నారంటే..?

అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Elections) మూడింట ఒకవంతు సీట్లు గెలిచామన్న విషయాన్ని మాజీ మంత్రి చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగులను మార్చి ఉంటే బాగుండేదని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. అయితే.. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన హామీ ఇచ్చారు. అంటే ఈ ఘోర పరాజయానికి కారణం సిట్టింగులను మార్చకపోవడమేనని పరోక్షంగా కేటీఆర్ చెప్పారన్న మాట. అంతేకాదు.. బంధు పథకాలు కూడా పార్టీపై బాగా ప్రభావం చూపించాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పుకొచ్చారు. జహీరాబాద్ లోక్‌సభ స్థానంపై బీఆర్ఎస్ నిర్వహించిన సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు మాజీ మంత్రి దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చాలా మందిని మార్చే అవకాశం ఉందని.. ఇదే ఫైనల్ కాదని అధినేత కేసీఆర్ ఒకటికి పదిసార్లు చెప్పారు. అయితే.. నాలుగైదు స్థానాలకు మాత్రమే అభ్యర్థులను మార్చిన గులాబీ బాస్.. మిగిలిన స్థానాలకు మాత్రం సిట్టింగులకే టికెట్లు ఇచ్చేశారు. మార్పులు, చేర్పులు చేయకపోవడం వల్లే ‘కారు’కు పంచర్ అయ్యిందనే రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట. అయితే.. జరిగిందేదో జరిగిపోయిందని.. ఇకపై జరిగే ఎన్నికల్లో జాగ్రత్తలు పాటిస్తామంటూ గులాబీ పెద్దలు చెప్పుకుంటున్నారు.


కాంగ్రెస్‌పై కన్నెర్ర!!

కాంగ్రెస్ గురించి మాట్లాడిన కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వాళ్లు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారని చెప్పుకొచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగబోతోందన్నారు. ఈ మూడు ముక్కలాటలో బీఆర్ఎస్‌కే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆయన తెలిపారు. నెల రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటగట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అప్పుడే ప్రజల నుంచి నిరసన సెగలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు. అప్పుల బూచీ చూపించి హామీల నుంచి తప్పించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా? అని ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక తిరోగమన చర్యలకు పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ తెచ్చిన పథకాలు రద్దు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. జహీరాబాద్ పార్లమెంటు సీటును ఖచ్చితంగా గెలుస్తామని.. రాజకీయ పార్టీ అనగా ఎత్తుపల్లాలు తప్పవన్నారు. 2009లో పది అసెంబ్లీ సీట్లే గెలిచామని.. కేవలం ఆరునెలల్లోనే కేసీఆర్ దీక్షతో పరిస్థితి మారిందని కేటీఆర్ గుర్తు చేశారు.

Updated Date - Jan 07 , 2024 | 05:54 PM