Share News

AP Elections 2024: టీడీపీకి కాస్త రిలీఫ్.. ఇంకాస్త తలనొప్పి..!!

ABN , Publish Date - Apr 29 , 2024 | 05:52 PM

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్-18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్-25తో ముగిసింది. ఇక నామినేషన్ల విత్ డ్రా కూడా ఇవాళ (ఏప్రిల్-29తో) ముగిసింది. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది నేతలు రెబల్స్‌గా మారి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్. దీంతో వారంతా రెబల్స్‌గా మారి నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు నామినేషన్లు విత్ డ్రా చేసుకోగా.. మరికొందరు మాత్రం తగ్గేదేలా అంటూ బరిలోనే ఉన్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఇప్పుడు వారందరికీ ఎన్నికల కమిషన్ గుర్తులను కేటాయించే పనిలో నిమగ్నమైంది.

AP Elections 2024: టీడీపీకి కాస్త రిలీఫ్.. ఇంకాస్త తలనొప్పి..!!

ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) కీలక ఘట్టం ముగిసింది. ఏప్రిల్-18న ప్రారంభమైన నామినేషన్ల పర్వం ఏప్రిల్-25తో ముగిసింది. ఇక నామినేషన్ల విత్ డ్రా కూడా ఇవాళ (ఏప్రిల్-29తో) ముగిసింది. ఈ ఎన్నికల్లో టికెట్లు దక్కని చాలా మంది నేతలు రెబల్స్‌గా మారి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటంతో కొన్ని నియోజకవర్గాల సీట్లను తెలుగు తమ్ముళ్లకు ఇవ్వలేకపోయింది హైకమాండ్. దీంతో వారంతా రెబల్స్‌గా మారి నామినేషన్లు వేశారు. ఇందులో కొందరు నామినేషన్లు విత్ డ్రా చేసుకోగా.. మరికొందరు మాత్రం తగ్గేదేలా అంటూ బరిలోనే ఉన్నారు. విత్ డ్రాకు గడువు ముగియడంతో ఇప్పుడు వారందరికీ ఎన్నికల కమిషన్ గుర్తును కేటాయించే పనిలో నిమగ్నమైంది. కొందరికి గుర్తులు ఇవ్వగా.. మరికొందరికి ఒకట్రెండు రోజుల్లో ప్రకటన రానుంది.


1THREE-PARTIES-LOGO.jpg

కాస్త రిలీఫ్ అయినప్పటికీ..?

  • నూజివీడు టికెట్ రాకపోవడంతో నిరాశకు లోనైన టీడీపీ సీనియర్ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు రెబల్‌గా మారి నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. హైకమాండ్ రంగంలోకి దిగడంతో మెత్తబడ్డ ఆయన.. నామినేషన్ విత్ డ్రా చేసుకుని తిరిగి పసుపు కండువా కప్పుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కర్నూలు పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి కండువా కప్పుకోబోతున్నారు. ఇవాళ ఉదయమే తన అనుచరులను రిటర్నింగ్ కార్యాలయానికి పంపి.. ఫారం-05 నామినేషన్ రద్దు పత్రాలను సంబంధిత అధికారులకు ఇచ్చారు.

  • మరోవైపు.. మాడుగుల టీడీపీ టికెట్ ఆశించిన పైలా ప్రసాద్‌ చివరి నిమిషంలో మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణ మూర్తికి దక్కడంతో నిరాశకు లోనయ్యారు. జిల్లా ముఖ్యనేతలు, చంద్రబాబు నుంచి ఫోన్లు రావడంతో తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. మాడుగుల నియోజకవర్గ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తామని.. ఇందుకోసం తాను విత్ డ్రా చేసుకుంటున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. బండారుతో కలిసి ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొంటున్నారు.

  • ఇక పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం విషయానికొస్తే.. స్వతంత్ర అభ్యర్ధిగా మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్ పోటీ నుంచి తప్పుకున్నారు. టీడీపీ అభ్యర్ధిని తోయక జగదీశ్వరి గెలుపు కోసం కృషి చేస్తానని వెల్లడించారు. కూటమి అధికారంలోకి వచ్చాక జయరాజ్‌కు తగిన ప్రాధాన్యత ఇస్తామనే హామీ హైకమాండ్ నుంచి వచ్చిందని అనుచరులు చెప్పుకుంటున్నారు.

  • పోలవరం టికెట్ విషయంలో ఎంత రగడ జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కూటమిలో భాగంగా జనసేనకు వెళ్లడంతో అభ్యర్థిగా చిర్రి బాలరాజు బరిలోకి దిగారు. అయితే టికెట్ తనకు ఇచ్చినట్లే ఇచ్చి టీడీపీ మొండిచేయి చూపిందని మొడియం సూర్యచంద్రరావు రెబల్‌గా మారారు. కాగా.. ఇక్కడ తెల్లం రాజ్యలక్ష్మి వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు.


tdp.jpg

తగ్గేదేలే..!!

  • ఇదిలా ఉంటే.. విజయనగరం నుంచి కూటమి తరఫున టికెట్ రాకపోవడంతో రెబల్‌గా మారిన మీసాల గీత ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. కూటమి తరఫున నేతలు నచ్చజెప్పినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. బరిలోనే ఉంటానని తేల్చిచెప్పేశారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. గీతకు గాజు గ్లాస్ కేటాయిండం జరిగింది. అయితే కూటమి నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. గాజు గ్లాస్ ఫ్రీ సింబల్ జాబితాలోనో ఉందని అధికారులు చెబుతున్న పరిస్థితి.

  • ముందుగా అనుకున్నట్లుగానే ‘ఉండి’ నియోజకవర్గంలో రచ్చ రచ్చే అయ్యింది. టికెట్ ఇచ్చినట్లే ఇచ్చి చివరి నిమిషంలో రఘురామకృష్ణం రాజుకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తికి లోనైన వేటుకూరి వెంకట శివరామరాజు రెబల్‌గా మారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా నేతలు, అగ్రనేతలు పలుమార్లు సమావేశమై బుజ్జగించినప్పటికీ రాజు మాత్రం నామినేషన్ వెనక్కి తీసుకోలేదు. ఆర్ఆర్ఆర్‌ను ఓడించి తీరుతానని శివరామరాజు శపథం చేస్తున్నారు.

  • ఇక మడకశిర, బద్వేలు, మైదుకూరులోనూ ఇదే పరిస్థితి. సునీల్ కుమార్ తాను మడకశిర బరిలోనే ఉంటానని హైకమాండ్‌కు తేల్చిచెప్పేశారు. చివరి నిమిషంలో తనకు టికెట్ దక్కాల్సిన టికెట్ జనసేనకు ఇవ్వడంతో కూటమిపై కోపంతో బద్వేలు బీజేపీకి రెబల్‌గా మారిన జయరాములు నామినేషన్ మాత్రం వెనక్కి తీసుకోలేదు. ఇక మైదుకూరులోనూ కూటమికి ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. చూశారుగా.. ఒక్క టీడీపీకే ఇంతమంది రెబల్స్ కావడంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీచేస్తున్న బీజేపీ, జనసేన అభ్యర్థులు ఒకింత ఆందోళన చెందుతున్నారు. అయితే ఇద్దరు కొట్టుకుంటే మూడో వ్యక్తి లాభపడతారన్నట్లుగా వైసీపీ ఉంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

Updated Date - Apr 29 , 2024 | 05:55 PM