Share News

Gnanavapi: కోర్టు కీలక తీర్పు.. జ్ఞానవాపిలో పూజలకు హిందువులకు అనుమతి..

ABN , Publish Date - Jan 31 , 2024 | 04:03 PM

జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. ..

Gnanavapi: కోర్టు కీలక తీర్పు.. జ్ఞానవాపిలో పూజలకు హిందువులకు అనుమతి..

జ్ఞానవాపి కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేలమాళిగలోని శివాలయం ఉన్నట్లు పేర్కొంటున్న ప్రాంతంలో పూజించే హక్కు హిందువులకు ఉందని తెలిపింది. కాశీ విశ్వనాథ ఆలయ పూజారులే ఈ పూజలు నిర్వహించాలని వెల్లడించింది. ఈ మేరకు బారికేడ్లు తొలగించాలని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేలమాళిగలోని ఆలయంలో పూజలు చేసేందుకు సోమనాథ్ వ్యాస్ మనవడు శైలేంద్ర పాఠక్ అనుమతి కోరారు. ఈ పూజలు క్రమం తప్పకుండా జరగుతాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన వారణాసి జిల్లా న్యాయమూర్తి డాక్టర్ అజయ్ కృష్ణ విశ్వేష్ ఈ మేరకు తీర్పు వెల్లడించారు.

సోమనాథ్ వ్యాస్ కుటుంబం1551 నుంచి అర్చక సేవలో కొనసాగుతోంది. 1992లో ఉత్తరప్రదేశ్‌లోని బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జ్ఞానవాపి లోని దక్షిణ నేలమాళిగలో పూజలను నిరాకరిస్తూ వ్యాస్ కు మౌఖికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు తీర్పుతో తాము సంతృప్తి చెందలేదని న్యాయం కోసం ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని అంజుమన్ కమిటీ తరఫు న్యాయవాది తెలిపారు.


జ్ఞానవాపి మసీదులోని నేలమాళిగలో ఉన్న దేవత విగ్రహానికి పూజలు జరిగేవి. డిసెంబరు 1993లో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు నేలమాళిగలో పూజలను నిషేధించారు. దీనిపై సోమనాథ్ వ్యాస్, రామ్‌రంగ్ శర్మ, హరిహర్ పాండేలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో సర్వే నంబర్లు 9130, 31,32 లు కాశీ విశ్వనాథుని ఆస్తి అని నొక్కి చెప్పడం విశేషం.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 31 , 2024 | 04:08 PM