Share News

Union Minister: కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. ఓటమి భయంతోనే డీఎంకే కూటమిలోకి కమలహాసన్‌..

ABN , Publish Date - Mar 13 , 2024 | 11:51 AM

ఏ కూటమిలో చేరినా ఓటమి ఖాయమనే భయంతోనే మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్‌(Kamala Haasan) అవినీతి అక్రమాలకు నెలవైన డీఎంకే కూటమిలో చేరి ఆ పార్టీ అవినీతికి గట్టి మద్దతు ప్రకటించారని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌(Union Minister L. Murugan) విమర్శించారు.

Union Minister: కేంద్రమంత్రి సంచలన కామెంట్స్.. ఓటమి భయంతోనే డీఎంకే కూటమిలోకి కమలహాసన్‌..

- కేంద్ర మంత్రి మురుగన్‌

చెన్నై: ఏ కూటమిలో చేరినా ఓటమి ఖాయమనే భయంతోనే మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్‌(Kamala Haasan) అవినీతి అక్రమాలకు నెలవైన డీఎంకే కూటమిలో చేరి ఆ పార్టీ అవినీతికి గట్టి మద్దతు ప్రకటించారని కేంద్రమంత్రి ఎల్‌.మురుగన్‌(Union Minister L. Murugan) విమర్శించారు. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎంపికైన తర్వాత తొలిసారిగా ఆదివారం ఉదయం ఊటీకి వెళ్లిన మురుగన్‌కు స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఆ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ ప్రజల మద్దతు అధికమవుతోందని, లోక్‌సభ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువ సీట్లలో గెలుస్తామనే నమ్మకం కలుగుతోందని చెప్పారు. డీఎంకేలో అవినీతిపరుల సంఖ్య అధికమైందని, ఇటీవల మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో డీఎంకే ప్రముఖుడు అరెస్టయ్యారని, ఈ విషయం వెలుగులోకి రాగానే స్టాలిన్‌ ఆయనను పార్టీ నుండి బహిష్కరించి ఏమి ఎరుగనట్లు ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. డీఎంకే ఎంపీ రాజా, పర్యాటక శాఖ మంత్రి రామచంద్రన్‌ సహా ఆ పార్టీకి చెందిన 11 మందిపై అవినీతి కేసులు నమోదై ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో డీఎంకేకు చెందిన కౌన్సిలర్‌ స్థాయి నుండి జిల్లా శాఖ అధ్యక్షుల వరకూ అందరూ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కొన్ని కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో డీఎంకే కౌన్సిలర్లపై ఆ పార్టీ కౌన్సిలర్లే ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. మక్కల్‌ నీదిమయ్యం నేత కమల్‌ పార్టీని ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలతోనే పొత్తుపెట్టుకుని పోటీ చేస్తానని, అవినీతికి చిరునామాగా ఉన్న ద్రావిడ పార్టీలతో పొత్తుపెట్టుకోనంటూ గొప్పలు చెప్పుకున్నారని, ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో ఒక సీటు కూడా సం పాదించుకోకుండా వచ్చే యేడాది ఇచ్చే రాజ్యసభ సీటు కు ఆశపడి ఆ కూటమికి మద్దతు ప్రకటించడం సిగ్గుచేటన్నారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు అన్నామలై పాదయాత్ర కు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, ప్రధాని మోదీ రాకతో పార్టీ పరిస్థితి ఉన్నత స్థితికి చేరిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మునుపటి కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంటామని మురుగన్‌ ధీమా వ్యక్తం చేశారు.

కమల్‌ అసలు రంగు బయటపడింది...

డీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతో మక్కల్‌ నీదిమయ్యం నేత కమల్‌ అసలు రంగు ఏమిటో బయటపడిందని బీజేపీ శాసనసభ్యురాలు వానతి శ్రీనివాసన్‌ విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, కోయంబత్తూరులో మళ్లీ పోటీకి దిగుతానని ప్రగల్భాలు పలికిన కమల్‌ ఆఖరి క్షణంలో డీఎంకే కూటమిలో చేరి పార్టీ శ్రేణులను మోసగించారని అన్నారు. త్వరలో శుభవార్త చెబుతానంటూ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చి చివరకు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయకుండా మిన్నకుండిపోవటం కమల్‌ స్వార్థానికి నిదర్శనమన్నారు. రాజ్యసభ సీటుకు ఆశపడి ఆయన డీఎంకేలో చేరారని ఆమె ఎద్దేవా చేశారు.

Updated Date - Mar 13 , 2024 | 11:51 AM