Share News

National : ఇదీ మోదీ ప్రచార సరళి

ABN , Publish Date - May 31 , 2024 | 03:55 AM

బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు అన్నీ కలిపి ప్రధాని మోదీ 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

 National : ఇదీ మోదీ ప్రచార సరళి

న్యూఢిల్లీ, మే 30: బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌గా బహిరంగ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలు అన్నీ కలిపి ప్రధాని మోదీ 206 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ విస్తృతంగా పర్యటించారు.

ఎన్నికల ప్రచారం కోసమే బెయిల్‌ పొందిన ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఢిల్లీ, పంజాబ్‌లో తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. కాగా, గతంలో కాంగ్రెస్‌ అవినీతి, కుటుంబ పాలనను తన ప్రచారంలో ప్రధానంగా ఎండగట్టిన మోదీ ఈసారి దానికి హిందూత్వ కోణం జోడించారు.

అయోధ్య రామ మందిర నిర్మాణం తమ ఘనతగా చెప్పుకొంటూనే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆ మందిరానికి బాబ్రీ తాళం వేస్తుందని, మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తుందని, సంపదను దోచుకుని అధిక సంతానం ఉన్నవారికి ధారాదత్తం చేస్తుందని వ్యాఖ్యానించి దుమారం రేపారు. బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. వీటిపై తీవ్ర విమర్శలు రావడంతో తన ఉద్దేశం వేరే అంటూ వివరణ ఇచ్చారు.

మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతు, యువత వ్యతిరేకి అంటూ కాంగ్రెస్‌ సహా విపక్షాలు తీవ్రంగా ప్రచారం చేశాయి. అగ్నిపథ్‌ను రద్దు చేస్తామని ప్రకటించాయి. బీజేపీ విభజన రాజకీయాలను ఎండగట్టాయి. ఆ పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించాయి. రాజ్యాంగాన్ని రక్షించాలంటే కాషాయ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చాయి.

Updated Date - May 31 , 2024 | 07:52 AM