Share News

Ajit Pawar: 80 ఏళ్లొచ్చినా కొందరంతే... సీనియర్ పవార్‌పై జూనియర్ సెటైర్..

ABN , Publish Date - Jan 07 , 2024 | 08:51 PM

ఎన్‌సీపీ నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన అంకుల్ శరద్ పవార్‌పై మళ్లీ సైటర్లు వేశారు. కొందరు వ్యక్తులు 80వ పడిలో ఉన్నా రిటైర్ కావడానికి ఇష్టపడరని పరోక్షంగా శరద్‌ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

Ajit Pawar: 80 ఏళ్లొచ్చినా కొందరంతే... సీనియర్ పవార్‌పై జూనియర్ సెటైర్..

ముంబై: ఎన్‌సీపీ (NCP) నేత, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) తన అంకుల్ శరద్ పవార్ (Sharad Pawar)పై మళ్లీ సైటర్లు వేశారు. కొందరు వ్యక్తులు 80వ పడిలో ఉన్నా రిటైర్ కావడానికి ఇష్టపడరని పరోక్షంగా శరద్‌ పవార్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. థానేలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అజిత్ పవార్ మాట్లాడుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంలో 58 ఏళ్లకు ఉద్యోగులు పదవీ విరమణ చేస్తారని, చాలా మంది వ్యక్తులు సహజంగా తమ యాక్టివ్ ప్రొఫెషనల్ లైఫ్‌ను 75 ఏళ్లకు ఆపేస్తారని చెప్పారు. 80 ఏళ్లు పైబడి, ఇప్పుడు 84 ఏళ్లకు చేరిన తర్వాత కూడా ఒకరు (పవార్) రిటైర్ కావడానికి సిద్ధపడటం లేదన్నారు. శరద్ పవార్ వయసుపై గత ఏడాది జూలైలోనూ అజిత్ ఇదే తరహాలో విమర్శించారు.


అజిత్ పవార్ గత ఏడాది జూలైలో తన విధేయులైన ఎమ్మెల్యేలతో కలిసి శివసేన-బీజేపీ ప్రభుత్వంలో చేశారు. ఎన్‌సీపీ మెజారిటీ ఎమ్మెల్యేలు తనతోనే ఉన్నారంటూ ఆ పార్టీ పేరు, గుర్తు తమదేనని క్లెయిమ్ చేసుకున్నారు. దీనిని ఎన్‌సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఎన్నికల కమిషన్ ముందు సవాలు చేశారు. కాగా, అజిత్ పవార్ మాత్రం శివసేన-బీజేపీ ప్రభుత్వంలో తన చేరికను సమర్ధించుకున్నారు. తాము ప్రభుత్వంలో చేరినది కష్టపడి పనిచేయడానికేనని అన్నారు. అధికారం లేకుండా ప్రజా సేవ, సమస్యల పరిష్కారం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు.


మనోజ్ జారంగే ప్రకటనపై...

మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల డిమాండ్‌పై ముంబై వరకూ మార్చ్ నిర్వహిస్తామని మరాఠా కోటా హక్కుల కార్యకర్త మనోజ్ జారంగే చేసిన హెచ్చరికలను అజిత్ పవార్ తోసిపుచ్చారు. చట్టాన్ని ఎవరు తమ చేతుల్లోకి తీసుకున్నా ఊరుకోమని చెప్పారు. మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్‌పై కొందరు చర్చ జరుపుతున్నారని, తమ డిమాండ్లపై మాట్లాడేందుకు వారు ముంబై రావాలనుకుంటున్నారని, అయితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే ఊరుకోమని, చట్టానికి ఎవరూ అతీతులు కారని అజిత్ అన్నారు.

Updated Date - Jan 07 , 2024 | 08:51 PM