Share News

Central Government: విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యత

ABN , Publish Date - Feb 02 , 2024 | 01:32 PM

విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే భారత విద్యార్థులను సమీప భారత ఎంబసీలు, కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నామని కేంద్రం వెల్లడించింది.

Central Government: విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యత

ఢిల్లీ: విదేశాల్లో చదువుకునే భారత విద్యార్థుల సంక్షేమానికే ప్రాధాన్యతనిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే భారత విద్యార్థులను సమీప భారత ఎంబసీలు, కాన్సులేట్లలో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతున్నామని కేంద్రం వెల్లడించింది. రిజిస్టర్ చేసుకున్న విద్యార్థులతో నిత్యం భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోంది. యూనివర్సిటీలను, అక్కడి భారతీయ సమూహాలను ఏంబసీ ఉన్నతాధికారులు తరచుగా కలుస్తున్నారని కేంద్రం తెలిపింది.

పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డా.సుబ్రహ్మణ్యం జైశంకర్ సమాధానమిస్తూ.. విదేశాల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. వివిధ మార్గాల్లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ఎంఏడీఏడీ పోర్టర్‌ ఏర్పాటు చేశామని తెలిపింది. ఫోన్ కాల్, ఈ-మెయిల్, సోషల్ మీడియా, నేరుగా వాక్-ఇన్ విధానాల్లో విద్యార్థులు సంప్రదించే వెసులుబాటు ఉంటుందని వెల్లడించింది.

విద్యార్థులు చదువుకుంటున్న దేశాల్లో సంక్షోభాలు, విపత్తులు, యుద్ధాలు సంభవించినప్పుడు వారిని భారత్‌కు తీసుకొచ్చేందుకు ఎయిర్‌లిఫ్ట్ రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టామని వెల్లడించింది. ఆపరేషన్ గంగ, ఆపరేషన్ అజయ్ వంటివి కొన్ని ఉదాహరణలు అని కేంద్రం తెలిపింది. గత మూడేళ్లలో 23,906 మంది విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చామని పేర్కొంది. 2018 నుంచి ఇప్పటి వరకూ విదేశాల్లో చదువుకుంటున్న 403 మంది భారత విద్యార్థులు మృతి చెందినట్టు తమ వద్ద గణాంకాలు చెబుతున్నాయని తెలిపింది. అత్యధిక మరణాలు కెనడా (91), యూకే (48), రష్యా (40), యుఎస్ఏ (36), ఆస్ట్రేలియా (35) దేశాల్లో సంభవించాయని వెల్లడించింది.

Updated Date - Feb 02 , 2024 | 01:32 PM